మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయం

మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయం

రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని దాసోజు శ్రవణ్ అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల అభిమానం పొందుతోందని చెప్పారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణితోనే కాళేశ్వరం, మేడిపల్లి నీట మునిగిందని..లక్షా యాభై వేల కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ అనాలోచితంగా నీటిపాలు చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ముంపుపై కనీసం రివ్యూ చేయకపోవడం దుర్మార్గమన్నారు. 

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ కేంద్రంపై అనవసర విమర్శలు చేస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజలు కుటుంబ పాలనకు చరమగీతం పాడి బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.