జాబ్ పేరుతో నమ్మించి.. కూతురి కిడ్నాప్

జాబ్ పేరుతో నమ్మించి.. కూతురి కిడ్నాప్

జాబ్ ఇప్పిస్తానని తండ్రిని నమ్మించి..అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఘటన హయత్ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది.  వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా మల్లేపల్లికి చెందిన  ఎలిమినేటి యాదయ్య బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి రంగారెడ్డి జిల్లా బొంగులూరు గేట్ వద్ద చిన్న హోటల్ నడుపుడుతూ..తన ముగ్గురు పిల్లలను చదివిస్తున్నాడు. ఈ నెల 23న ఉదయం యాదయ్య హోటల్ దగ్గరికి టిఫిన్ చేసేందుకు కారులో వచ్చి యాదయ్య వివరాలు అడిగాడు. యాదయ్య పెద్ద కూతురు సోని(21) కొత్తగూడెంలో బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతోందని తెలుసుకున్న ఆ వ్యక్తి తన పేరు శ్రీధర్ రెడ్డి అని..తాను ఉస్మానియా హాస్పిటల్ లో జనరల్ సర్జన్ గా పనిచేస్తానని యాదయ్యతో చెప్పాడు. సోనికి జాబ్ ఇప్పిస్తానని ఆ వ్యక్తి యాదయ్యని నమ్మించాడు. యాదయ్య సోనికి ఫోన్ చేసి రాగన్నగూడ బస్టాప్ వద్దకు రమ్మన్నాడు. అక్కడికి యాదయ్య పెద్ద కూతురు సోని, కుమారుడు డేవిడ్ వచ్చారు.  ఆ వ్యక్తి తన కారులో సోనీ, డేవిడ్, యాదయ్యను ఎక్కించుకుని.. సుమారు 7 గంటల వరకు సిటీలోనే తిప్పి ఎల్ బీనగర్ చౌరస్తాలో మాయమాటలు చెప్పి డేవిడ్ ను దింపేశాడు. హయత్ నగర్ చేరుకుని కారులో ఉన్న యాదయ్యకు ఓ పేపర్ ఇచ్చి జిరాక్స్ తీయించుకుని రమ్మన్నాడు. జిరాక్స్ కోసం యాదయ్య వెళ్లగానే.. ఆ వ్యక్తి కారుతో పాటు పరారయ్యాడు. తన కూతురు సోనిని కిడ్నాప్ చేశారని గ్రహించిన యాదయ్య పోలీసులకు కంప్లయింట్ చేశాడు.