అందరినీ కలుపుకుపోయే నేతకే డీసీసీ అధ్యక్ష పగ్గాలు : రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ పీవీ.మోహన్

అందరినీ కలుపుకుపోయే నేతకే డీసీసీ అధ్యక్ష పగ్గాలు : రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ పీవీ.మోహన్
  •     ఏఐసీసీ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్​ పీవీ.మోహన్​  

చేవెళ్ల, వెలుగు: పార్టీని సమర్థంగా ముందుకు నడిపిస్తూ అందరినీ కలుపుకుపోయే నేతకే డీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తామని ఏఐసీసీ కార్యదర్శి, కర్ణాటక ఎమ్మెల్సీ, రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ పీవీ.మోహన్ స్పష్టం చేశారు. బుధవారం మొయినాబాద్ లోని ఓ ఫామ్‌‌హౌస్‌‌లో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ  ఇన్​చార్జి పామెన భీమ్ భరత్ ఆధ్వర్యంలో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు తమ అభిప్రాయాలు, పార్టీ అభివృద్ధికి సంబంధించిన సూచనలు తెలియజేశారు. 

అనంతరం పీవీ.మోహన్ మాట్లాడుతూ.. ఏఐసీసీ సూచనల మేరకు కొత్త డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం సంఘటన్ సృజన్ అభియాన్ పేరుతో క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వారికి అవకాశం ఉంటుందని తెలిపారు. పీసీసీ అబ్జర్వర్, సత్తుపల్లి ఎమ్మెల్యే  మట్టా రాగమయి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ.శ్రీనివాస్ రావు, కార్యదర్శి రాంరెడ్డి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీశ్, జిల్లా లైబ్రరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్​పర్సన్లు షాబాద్ సోనియా దర్శన్,  ప్రవీణ్, సమత వెంకట్ రెడ్డి, సీనియర్​నాయకులు జనార్దన్ రెడ్డి, అశ్వక్, ఉదయ్ మోహన్ రెడ్డి, ఐదు మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.