ఆలేరుకు ఇద్దరు ఎమ్మెల్యేలు!

ఆలేరుకు ఇద్దరు ఎమ్మెల్యేలు!

యాదాద్రి, వెలుగు : ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్​ లీడర్లు, కార్యకర్తలపై డీసీసీబీ చైర్మన్​గొంగిడి మహేందర్​రెడ్డి సీరియస్​అయ్యారు. ఎవరూ బయటకు వెళ్లకుండా గేట్లు బంద్​ చేయాలని ఆదేశించారు. మీటింగ్​కు రానివాళ్లను పదవుల నుంచి తొలగించి, కొత్తోళ్లను నియమిస్తామని ఫైర్​అయ్యారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజవర్గంలోని రాజాపేటలో  సోమవారం బీఆర్ఎస్​ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇతర కార్యక్రమాలు ఉండడంతో ఎమ్మెల్యే గొంగిడి సునీత ముందుగానే మాట్లాడి వెళ్లిపోయారు. తర్వాత మీటింగ్​ను గొంగిడి మహేందర్​రెడ్డి నడిపించారు. ఈ సందర్భంగా లీడర్లను వేదికపైకి వచ్చి మాట్లాడాలని ఆహ్వానించారు. అయితే వారిలో కొందరు రాకపోవడంతో సీరియస్​ అయ్యారు. మీటింగ్​కు రాని వాళ్లకు పదవులెందుకు? వారిని తొలగించి కొత్త వాళ్లను ఎంపిక చేయాలని కామెంట్​చేశారు. మీటింగ్​కంటిన్యూగా సాగుతుండడం, ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడంతో ముందుగానే భోజనాలు చేయాలని కొందరు లీడర్లు, కార్యకర్తలు లేవడానికి ప్రయత్నం చేస్తుండడంతో మహేందర్​రెడ్డి మైక్​ అందుకొని అందరికి సరిపడా భోజనాలున్నాయి.. ఎవరూ బయటకు వెళ్లొద్దు కూర్చోండని పలుమార్లు అభ్యర్థించారు. ఇదే సమయంలో కొందరు లీడర్లు బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. మరికొందరు లీడర్లు వెళ్లిపోవడానికి కార్లను స్టార్ట్​ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన ‘ఎవరూ బయటకు వెళ్లొద్దు. ఎవరిని పోనియ్యొద్దు. గేట్లు బంద్​ చేయండి. తాళాలు వేయండి. వెళ్లిపోతున్న ఆ కారు నెంబర్​ నోట్​ చేసుకోండి’ అని మైక్​లో ఆదేశించారు.  అయినప్పటికీ కొందరు వెళ్లిపోగా, మరికొందరు వచ్చి కూర్చున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ పైకి లేచి ‘ఉన్నోళ్లకే పదవులు ఇస్తే.. మేమెట్లా బతకాలంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతా గందరగోళంగా ఉండడంతో ఆమె మాట్లాడేది విన్పించలేదు. ఇది గమనించిన ఓ లేడీ కానిస్టేబుల్​ అక్కడికి వచ్చి ఆ మహిళను పక్కకు తీసుకెళ్లారు. ఈ టైంలోనే ఓ మహిళకు ఫిట్స్​వచ్చి కింద పడిపోవడంతో అందరూ కొద్దిసేపు కంగారుపడ్డారు. 

ఆలేరుకు ఇద్దరు ఎమ్మెల్యేలు!

ఆత్మీయ సమ్మేళనంలో ఓ లీడర్​ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా ఆలేరుకు ఇద్దరు ఎవ్మెల్యేలున్నారన్నారు. దీంతో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 'అన్ని నియోజకవర్గాలకు ఒక్క ఎమ్మెల్యే ఉంటే.. ఆలేరుకు ఇద్దరు ఎమ్మెల్యేలున్నరు. మేడం (ఎమ్మెల్యే గొంగిడి సునీత) అందుబాటులో లేకున్నా మహేందర్​రెడ్డి (డీసీసీబీ  ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే  భర్త) పగలనకా.. రాత్రనక చూసుకుంటడు. నిజంగా ఆలేరు ప్రజలు అదృష్టవంతులు’ అని అన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా సునీతను గెలపించుకుంటే మంత్రి అవుతుందని పలువురు కార్యకర్తలు కామెంట్​ చేశారు. మరికొందరు మాట్లాడుతూ పాత, కొత్త లీడర్ల మధ్య విభేదాలున్నాయన్నారు.  ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదన్నారు. కార్యకర్తలను చీప్​గా చూస్తూ డమ్మీలుగా మార్చేస్తున్నారన్నారు.  ఐకమత్యం లేక గత మండల పరిషత్​ ఎన్నికల్లో మన అభ్యర్థులను మనమే ఓడించుకున్నామని, ఈసారి పొరపాట్లు జరగకుండా ముందే గుర్తించి  విబేధాలు 
పరిష్కరించాలన్నారు.