
- కార్పొరేషన్ ద్వారా తీసుకున్న గత సర్కార్: దామోదర
- దవాఖాన్లు, కాలేజీల్లో కనీస వసతులు కల్పించలేదు
- వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం
- తమిళనాడు తరహాలో ట్రామా కేర్ వ్యవస్థ
- యాక్సిడెంట్లలో గాయపడ్డవాళ్లకు లక్ష దాకా ఉచిత చికిత్స
- త్వరలోనే డాక్టర్లు, సిబ్బంది ట్రాన్స్ఫర్లు ఉంటాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్సర్కారు ఆరోగ్యశాఖలోనూ అడ్డగోలుగా అప్పులు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ విమర్శించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ అని పెట్టి.. దాని ద్వారా బ్యాంకుల నుంచి రూ.9వేల కోట్లు అప్పు చేశారని ఆయన వెల్లడించారు. అంత అప్పు చేసినా.. మెడికల్ కాలేజీలు, దవాఖాన్లలో కనీస వసతులు కల్పించలేదని ఆయన పేర్కొన్నారు. ఒక శాస్త్రీయ పద్ధతి లేకుండా, ఇష్టారీతిన మెడికల్ కాలేజీలకు శాంక్షన్స్ ఇచ్చారని, వాటిలో టీచింగ్ ఫ్యాకల్టీని నియమించకుండా, అవసరమైన వసతులు కల్పించకుండా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టారని ఆయన మండిపడ్డారు. కాలేజీల సంఖ్య ఒకేసారి పెంచడం వల్ల టీచింగ్ ఫ్యాకల్టీ దొరకడం లేదని మంత్రి వెల్లడించారు. తానే ఇంజినీరు.. తానే డాక్టర్ అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించారని దుయ్యబట్టారు. కరోనా వస్తే పారాసిటమాల్ సరిపోతదని, కాళేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్ చేశానని చెప్పారని మంత్రి ఎద్దేవా చేశారు. ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్రావు సిద్దిపేట కాలేజీపై పెట్టిన శ్రద్ధ, ఉస్మానియా హాస్పిటల్పై పెట్టలేదన్నారు. ఆయనకు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడమే అలవాటుగా మారిందని ఫైర్అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో గాడి తప్పిన వైద్య వ్యవస్థను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మంత్రి మంగళవారం చిట్ చాట్ చేశారు.
హాస్పిటళ్లు, మెడికల్ షాపులు, హోటళ్లపై నిరంతర పర్యవేక్షణ
ప్రైవేటు హాస్పిటళ్లు, మెడికల్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లపై ఇకనుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం మూడు టాస్క్ఫోర్స్లు నియమించబోతున్నామని చెప్పారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను కఠినంగా అమలు చేసి, ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని నియంత్రిస్తామని ఇందుకోసం ఓ టాస్క్ఫోర్స్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో నకిలీ మెడిసిన్ తయారీ, ట్రాన్స్పోర్టేషన్, మెడిసిన్ ధరల నియంత్రణ, మెడికల్ షాపుల్లో తనిఖీలను పర్యవేక్షించేందుకు మరో టాస్క్ఫోర్స్ పనిచేస్తుందన్నారు. ఫుడ్ కల్తీ చేసే వారిపై కఠిన చర్యల కోసం మూడో టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందన్నారు. డ్రగ్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందితో పాటు టెస్టింగ్ ల్యాబ్స్, మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యనూ పెంచుతామన్నారు.
35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్
రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ప్రతి 35 కి.మీ.కు ఒకటి చొప్పున మొత్తం 75 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు తమిళనాడు తరహా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. యాక్సిడెంట్లో గాయపడిన వారికి అన్ని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్లో రూ.లక్ష వరకు ఉచితంగా ట్రీట్మెంట్ అందించేలా ఈ స్కీమ్ ఉంటుందన్నారు. యాక్సిడెంట్ స్పాట్కు దగ్గర్లో ఏ హాస్పిటల్ ఉంటే, ఆ హాస్పిటల్కు అంబులెన్స్లు పేషెంట్ను తీసుకెళ్తాయని, అక్కడ పేషెంట్కు ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి తప్పించిన తర్వాత, పేషెంట్ లేదా అతని కుటుంబ సభ్యుల ఇష్టప్రకారం ఏ
హాస్పిటల్కైనా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
65 ఏండ్లకు ఏడీఎంఈల రిటైర్మెంట్
ప్రస్తుతం ఒక సొసైటీ కింద ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ను తెలంగాణ సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్గా మార్చుతున్నామని మంత్రి తెలిపారు. వీవీపీ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా సాలరీలు అందజేస్తామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత హెచ్వోడీ పోస్టులను క్రియేట్ చేయడంలో గత సర్కార్ నిర్లక్ష్యం చేసిందని మంత్రి తెలిపారు. తాము వీవీపీ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ పోస్టులను క్రియేట్ చేస్తున్నామన్నారు. అడిషనల్ డీఎంఈల రిటైర్మెంట్ వయసును 65 ఏండ్లకు పెంచుతామని మంత్రి వెల్లడించారు. కొందరు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు డ్యూటీలకు ఆబ్సెంట్ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే తమకు కంప్లైంట్ చేయాలన్నారు. కంప్లైంట్ల కోసం త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు.
త్వరలోనే ట్రాన్స్ఫర్లు
త్వరలో తానే అన్ని హాస్పిటళ్లను సర్ప్రైజ్ విజిట్స్ చేస్తానని మంత్రి వెల్లడించారు. ఆస్పత్రులు, కాలేజీల్లో పాతుకుపోయిన డాక్టర్లు, టీచింగ్ ఫ్యాకల్టీ, సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేస్తామని తెలిపారు. ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవన్నారు. డీఎంహెచ్వోలను కూడా మారుస్తామన్నారు. డాక్టర్లను సిటీ నుంచి జిల్లాలకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాల్లో పనిచేసే వారికే ఎక్కువ వేతనాలు ఇస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏలో మార్పులు చేసేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే జీవో వస్తుందని చెప్పారు. తద్వారా జిల్లాల్లోని మెడికల్ కాలేజీలలో టీచింగ్ ఫ్యాకల్టీ కొరత లేకుండా చేస్తామన్నారు.