
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి శ్రీదేవి జీవిత చరిత్రపై ‘శ్రీదేవి: గర్ల్ వుమెన్ సూపర్స్టార్’ అనే పుస్తకం విడుదలైంది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బుక్ లాంచ్ సందర్భంగా శ్రీదేవిని గుర్తు చేసుకుని బోనీ కపూర్ కంటతడి పెట్టారు. ఆ సమయంలో పక్కనే ఉన్న దీపిక ఆయనను ఓదార్చారు. తాను కెరీర్ మొదలుపెట్టిన రోజుల్లో శ్రీదేవి, బోనీ కపూర్ తనకు ఎంతో సపోర్ట్గా నిలిచారని, తాను ఈ స్టేజ్లో ఉండటానికి వారిద్దరే కారణమని దీపిక గుర్తు చేసుకున్నారు. తన ప్రతి సినిమా రిలీజ్ అయిన తర్వాత పర్సనల్గా శ్రీదేవి మెసేజ్ చేసేవారన్నారు. శ్రీదేవితో తనకున్న బంధం గురించి చాలా మందికి తెలియదని, శ్రీదేవి సినీ నటి మాత్రమే కాదని, అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. బుక్ రచయిత సత్యార్థ్ నాయక్ మాట్లాడుతూ.. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీల్లో ఆమె వర్క్ను ఈ పుస్తకం తెలియజేస్తుందని చెప్పారు. ఈ పుస్తకం తాను శ్రీదేవికి ఇచ్చే నివాళి అని ఆయన పేర్కొన్నారు. వందలాది సినిమాల్లో నటించిన శ్రీదేవి గత ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్లోని ఓ హోటల్లో మరణించింది.