వంద రూపాయలకే.. రాకాస టికెట్

వంద రూపాయలకే.. రాకాస టికెట్

‘ప్రతి సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను’  అని నిర్మాత నిహారిక కొణిదెల చెప్పారు.  సంగీత్ శోభ‌‌న్‌‌, న‌‌య‌‌న్ సారిక‌‌ జంటగా మానస శర్మ దర్శకత్వంలో ఆమె నిర్మించిన ‘రాకాస’ చిత్రం  గత వారం విడుదలై  అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం  డిస్ట్రిబ్యూటర్లతో సక్సెస్‌‌మీట్‌‌ను  నిర్వహించారు. మైత్రి నిర్మాత వై రవి శంకర్ మాట్లాడుతూ ‘నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ని కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పుడు ‘రాకాస’తోనూ మంచి హిట్ కొట్టాం.  మున్ముందు ఆమె చేసే సినిమాలన్నీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నా.  సమ్మర్‌‌లో కూల్ బ్రీత్‌‌లా ఉండే చిత్రమిది’ అని అన్నారు.  

సంగీత్ శోభన్ మాట్లాడుతూ ‘డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అయితేనే సినిమా హిట్టైనట్టు.  రెండో వారంలోనూ ‘రాకాస’కి మంచి స్క్రీన్లు ఉన్నాయి. అదే మా సినిమా విజయానికి నిదర్శనం’ అని చెప్పాడు.  తన డ్రీమ్‌‌ని,  కథను ఇంతవరకు తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని మానస శర్మ చెప్పింది. నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘మా డిస్ట్రిబ్యూటర్లందరూ హ్యాపీగా ఉన్నారంటే అదే మాకు నిజమైన విజయం.  సింగిల్ స్క్రీన్‌‌లలో  కేవలం వంద రూపాయలకే అందిస్తున్నాం’ అని అన్నారు.  నటుడు బ్రహ్మాజీ,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ సహా  పలువురు డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.