దేశంలో భారీ పేలుళ్లకు ఐఎస్ ఐ ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐ, ముంబై అండర్ వరల్డ్ నెట్ వర్క్ ఆదేశాలతో పనిచేస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోని ఢిల్లీ, ముంబై వంటి కీలకనగరాలు, భద్రతా బలగాలు లక్ష్యంగా దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు.
స్పెషల్ సెల్ నిర్వహించిన నిఘా ఆపరేషన్ అనంతరం ఐఎస్ ఐ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రెనేడ్లు, అధునాతన ఆయుధాలు కూడా లభించినట్లు పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా నిందితులకు ముంబై అండర్వరల్డ్తో ఉన్న సంబంధాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నెట్వర్క్కు నిధులు ఎలా సమకూరాయి.. సభ్యులను ఎలా నియమించుకున్నారు, లాజిస్టిక్ మద్దతు ఎవరు అందించారు అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. కమ్యూనికేషన్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలను కూడా విశ్లేషిస్తున్నారు.
ALSO READ : నటి ఖుష్బూ ఇంటిలో పెళ్లి సందడి..
అరెస్టయిన వారిలో ఢిల్లీ, ముంబై, పంజాబ్కు చెందిన వ్యక్తులతో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కుట్ర వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
