బిజినెస్డెస్క్, వెలుగు: ఒకప్పుడు చిన్న కార్లకు ఫుల్ డిమాండ్ ఉండేది. మొదటి సారిగా కొనేవారు ఈ సెగ్మెంట్లోని కార్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. మారుతి 800 దేశంలో ఎంత పాపులర్ అయిందో చూశాం. ఈ మోడల్ 1983 లో లాంచ్ అవ్వగా, 2014 వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. 2000 సంవత్సరంలో ఆల్టోను తీసుకొచ్చిన మారుతి, ఈ ఏడాది జూన్ నాటికి 41.72 లక్షల ఆల్టో కార్లను సేల్ చేయగలిగింది. కానీ, గత రెండు మూడేళ్ల నుంచి చిన్న కార్లపై కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ఎంట్రి లెవెల్ హ్యాచ్బ్యాక్ (ఆల్టో కార్లలా ఉంటాయి) సెగ్మెంట్లో మారుతి ఆల్టో, ఎస్–ప్రెస్సో మోడల్స్కు 85 శాతం వాటా ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు మోడల్స్కు చెందిన 2,66,994 వెహికల్స్ను కంపెనీ అమ్మగలిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంతో చూస్తే ఈ కార్లకు డిమాండ్ 9.36 శాతం తగ్గింది. ఇదే టైమ్లో కాంపాక్ట్ లేదా ప్రీమియం హ్యాచ్బ్యాక్ (చిన్న కార్ల కంటే కొద్దిగా పెద్దవి, బాలెనో కార్లలా ఉంటాయి) కార్లకు డిమాండ్ పెరుగుతోందని సియామ్ డేటా చెబుతోంది. వేగన్ ఆర్ , బాలెనో, స్విఫ్ట్, ఇగ్నిస్, సెలెరియో వంటి మోడల్స్తో కాంపాక్ట్ సెగ్మెంట్లో మారుతి సుజుకీకి 60 శాతం వాటా ఉంది.
సెడాన్ కార్ల నుంచి షిఫ్ట్ అవుతున్నారు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో మారుతి ఆల్టో, ఎస్–ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్ మోడల్ అమ్మకాలు 33,775 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే టైమ్లో కాంపాక్ట్ సెగ్మెంట్లో 1,36,670 యూనిట్లు సేల్ అయ్యాయి. స్విఫ్ట్, డిజైర్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు, ఎంట్రి లెవెల్ కార్లపై 2010–11 నుంచి ప్రభావం చూపుతున్నాయి. ఇదే ట్రెండ్ కరోనా సంక్షోభం టైమ్లో కూడా కనిపించింది. మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీని పరిగణనలోకి తీసుకుంటే 2020–21 లో 2,66,994 యూనిట్ల చిన్న కార్లు సేల్ అయ్యాయి. అదే కాంపాక్ట్ సెగ్మెంట్లో 11,98,792 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్లియర్గా ఎంట్రి లెవెల్స్ కంటే కాంపాక్ట్ కార్లకు గిరాకీ పెరిగిందని తెలుస్తోంది. ‘కాంపాక్ట్ కార్లను వాడే కన్జూమర్లు పెరగలేదు. కానీ, సెడాన్ కార్ల (రూపం హోండా అమేజ్లా ఉంటుంది) కస్టమర్లు ఈ మోడల్ కార్ల వైపు షిఫ్ట్ అవుతున్నారు’ అని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. ప్యాసెంజర్ వెహికల్ మార్కెట్లో 2014–15 లో సెడాన్ కార్లకు 24.2 శాతం వాటా ఉండేది. 2020–21 లో ఈ వాటా 11 శాతానికి తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య ప్యాసింజర్ కార్ల మార్కెట్లో సెడాన్ వాటా 10.5 శాతంగా రికార్డయ్యింది. ఇలా సెడాన్ మార్కెట్ షేరు తగ్గుతుండడంతో కాంపాక్ట్ కార్ల మార్కెట్ ఎక్కువగా లాభపడుతోంది. ‘ఆల్టో కార్ల (క్యాబ్లు వంటి వాటి కోసం కోసం కాకుండా) కు డిమాండ్ తగ్గడం కొన్నేళ్ల కిందటే స్టార్టయ్యింది’ అని ఎల్ఎంసీ ఆటోమోటివ్ ఎనలిస్ట్ అమర్ మాస్టర్ అభిప్రాయపడ్డారు. ఇండియన్ మార్కెట్లో ఆల్టో కార్ల సేల్స్ 2018 లో 2.60 లక్షల యూనిట్లుగా ఉండగా, 2020 నాటికి 1.5 లక్షల యూనిట్లకు తగ్గాయి. ఆల్టో (ఇతర చిన్న కార్లు) యాన్యువల్ సేల్స్ను లెక్కిస్తున్నామని, ఈ కార్ల సేల్స్ 2018 నుంచి ఏడాదికి 80–90 వేలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు.
చిన్న కార్ల సేల్స్ పడడానికి కారణం.
ప్రజల ఆదాయాలు పెరుగుతుండడంతో చిన్న కార్ల కంటే కాంపాక్ట్ కార్ల వైపు కన్జూమర్లు చూడడం పెరిగిందని ఎనలిస్టులు చెబుతున్నారు. కార్లను కొనేముందు వెహికల్ సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వడం పెరిగిందని అన్నారు. సేఫ్టీ రెగ్యులేషన్స్ కఠినంగా మారడం, బీఎస్–6 ఎమిషన్ రూల్స్ను పాటించాల్సి ఉండడంతో చిన్న కార్ల ధరలు రూ. 20–30 వేల వరకు పెరుగుతున్నాయి. దీంతో మొదటిసారి కార్లను కొనాలనుకునేవారిపై ఈ పెరిగిన ధరలు ప్రభావం చూపుతున్నాయి. ఇంకో రూ. లక్ష పెట్టుకుంటే కాంపాక్ట్ కారు వస్తుంది కదా అనే ఆలోచన కన్జూమర్లలో పెరుగుతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో చిన్న కార్ల మార్కెట్ షేరు 35 శాతంగా, కాంపాక్ట్ కార్ల మార్కెట్ షేరు 30 శాతంగా ఉంది. రానున్న కొన్నేళ్లలో మినీ కార్ల మార్కెట్ షేరు 30 శాతంలోపు పడిపోతుందని అమర్ అంచనా వేస్తున్నారు. బయ్యర్లు ఎంట్రీ లెవెల్ కార్లను విడిచిపెట్టి పెద్ద కార్లను కొనడానికి ఆసక్తి చూపించడం పెరుగుతుందన్నారు. కాంపాక్ట్ కార్లను అఫోర్డబుల్ ధరలోనే వివిధ మోడల్స్లలో కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో కూడా కస్టమర్లకు చిన్న కార్లపై కంటే పెద్ద కార్లపై ఆసక్తి పెరుగుతోంది. గ్లోబల్ కంపెనీల నుంచి పోటీ పెరగడంతో చిన్న కార్ల కంపెనీగా పేరున్న మారుతి ఇప్పుడు పెద్ద కార్లపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విటారా బ్రెజ్జా, బాలెనో, ఇగ్నిస్ వంటి కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ త్వరలో ఐదు డోర్లు ఉండే ఎస్యూవీ మోడల్ జిమ్నీని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానుంది. కాగా, ఎస్యూవీ మోడల్స్ను మట్టి రోడ్లపై కూడా సాఫీగా వెళ్లేలా డిజైన్ చేస్తారు. వీటికి కూడా డిమాండ్ పెరుగుతోంది.