ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు తీర్చండి.. నాటి తెలంగాణ ఉద్యమం నుంచి

ఔట్ సోర్సింగ్  ఉద్యోగుల బాధలు తీర్చండి.. నాటి  తెలంగాణ ఉద్యమం నుంచి

నేటివరకు  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల  బతుకులు మారలేదు.  ఇప్పటికీ ఆ కుటుంబాలకు  ఎటువంటి  న్యాయం జరగలేదు.  ఎప్పటికైనా ఈ తెలంగాణలో జీవితాలు బాగుపడతాయని ఆశపడ్డారు. కానీ, వారి బతుకుల్లో ఎటువంటి మార్పు రాలేదు.  ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్​లో  ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొదటి తేదీన జీతాలు ఇస్తున్నారు.  సమాన పనికి సమాన వేతనం ఇస్తూ  ఉద్యోగ భద్రత ఇచ్చారు.  తెలంగాణలో  ఏజెన్సీ వ్యవస్థని  రద్దు చేయలేదు.  ఈ ఏజెన్సీ వ్యవస్థని పూర్తిగా రద్దుచేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందిస్తే వాళ్ల బతుకులు మారతాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం  ప్రవేశపెట్టిన పథకాలను  ప్రజలకి  చేరవేయడంలో వీరిది  ప్రధాన పాత్రగా ఉన్నది. ఉద్యోగస్తుల శ్రమని గుర్తించి  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి అందరికీ  శ్రమకు తగిన  ప్రతిఫలం ఇవ్వాలి. 

రెగ్యులరైజేషన్ కోసం ఐక్యంగా పోరాడాలి

సమాన పనికి సమాన వేతనం అనే హక్కును జగ్జీత్ సింగ్ కేసు (2016)లో సుప్రీంకోర్టు మరింత బలపరిచింది.  తాత్కాలిక ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులు వేతనాలే ఇవ్వాల్సి ఉందని తీర్పు ఇచ్చింది.  ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులకు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులతో సమానమైన రక్షణను ప్రభుత్వాలు కల్పించటం లేదు.  ఫలితంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు పేదరికంలోకి, అభద్రతలోకి జారిపోతున్నాయి.  రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం, సమానత్వం కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలి.   ఏడెనిమిది నెలలుగా ఏజెన్సీలు వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తున్నది. నెల తిరిగేసరికే పిల్లల ఫీజులు, ఇతర ఇంటి ఖర్చుల నేపథ్యంలో జీవితం భారంగా మారి ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభ్యుతాలు ఏజెన్సీలను రద్దుచేసి అందరినీ ఒకే కార్పొరేషన్ కిందకు తీసుకోని వచ్చి సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.  తెలంగాణలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల  బతుకులను మార్చి వారికీ,  వారి కుటుంబ సభ్యులకు ఆత్మగౌరవం ఇవ్వాలి.

- పులి లక్ష్మయ్య,
ప్రెసిడెంట్ 
తెలంగాణ స్టేట్ ఔట్ సోర్సింగ్ జేఏసీ