సెక్రటేరియెట్ పోలీసులకు జ్వరాలు

సెక్రటేరియెట్ పోలీసులకు జ్వరాలు
  • డెంగీ వచ్చి ఆస్పత్రుల్లో చేరిన 10 మంది

సెక్రటేరియెట్ లో పని చేస్తున్న పోలీసులకు జ్వరం పట్టుకుంది. 24 గంటలు డ్యూటీ చేసే ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్) పోలీసులకు కనీస వసతులు కల్పించకపోవడంతో దోమలు కుట్టి డెంగీ బారిన పడుతున్నారు. 10 మంది నైట్ డ్యూటీ పోలీసులకు డెంగీ వచ్చినట్లు తెలుస్తోంది. సెక్రటేరియెట్‌లోని శాఖల్ని బీఆర్కే కు తరలిస్తుండటంతో పోలీసులకు వసతులు కల్పించటం లేదని సమాచారం.

100 మందికి సౌలతుల్లేవ్

సెక్రటేరియెట్​ను షిఫ్ట్ చేస్తుండటంతో పోలీసులు డే అండ్ నైట్ కాపలా కాస్తున్నారు. ఫైళ్ల భద్రత కోసం బందోబస్తు పెంచారు. 100 మంది వరకు ఎస్పీఎఫ్ పోలీసులు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా మంది నైట్ షిఫ్ట్ లో డ్యూటీ చేస్తున్నారు. అక్కడ దోమల సమస్య ఎక్కువగా ఉన్నట్లు వారు చెబుతున్నారు. వారికి కనీస వసతులు లేకపోవడంతో దోమలు కుట్టి జ్వరం బారిన పడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మందికి  జ్వరాలు వచ్చాయి. ఓ పది మందికి డెంగీ జ్వరం వచ్చి ఆసుపత్రుల్లో జాయిన్ అయినట్లు చెబుతున్నారు. రాత్రి అయిందంటే చాలు దోమలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమకు ఎక్కడ జ్వరాలు వస్తాయోనని మిగతా పోలీసులు ఆందోళన చెందుతున్నారు. కనీస వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. దోమ తెరలు ఇవ్వలేదని, జీహెచ్ఎంసీ సిబ్బందితో దోమల పొగ కూడా వేయడం లేదని చెబుతున్నారు.

ఇక బీఆర్కే భవన్​లో ఎలా?

సెక్రటేరియెట్ లోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో బీఆర్కే భవన్ లో ఎలా డ్యూటీ చేయాలని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఆ భవనం మెయిన్ రోడ్డు పక్కనే ఉండటం, హుసేన్ సాగర్, జీహెచ్ ఎంసీ నాలా కూడా ఉండటంతో దోమల ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. సెక్రటేరియెట్ లో డ్యూటీ చేసే వారికి కనీస వసతులు కల్పించకపోతే ఎలా అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.