
- 21 వేల కోట్లతో 105 క్యాంపస్లు నిర్మిస్తున్నం
- వీటికి నిధుల కోసం ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వండి
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను కోరిన డిప్యూటీ సీఎం భట్టి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయమందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కోరారు. పిల్లలకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఈ స్కూళ్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. గురువారం ఢిల్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నిర్మలను భట్టి కలిశారు.
దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, లోన్ల రీస్ట్రక్చర్, విద్యాసంస్థలకు కేంద్ర సాయం, ఇతర అంశాలపై చర్చించారు. తెలంగాణ చేపట్టిన కులగణన సర్వేలో 56.33 శాతం బీసీలు, 17.43 శాతం ఎస్సీ, 10.45 శాతం ఎస్టీలు ఉన్నట్లు తేలిందని భట్టి వివరించారు. అయితే విద్య, పోషకాహార రంగాలలో ఫలితాలు తక్కువగా ఉన్నాయని.. ఈ అసమానతలు తరతరాలుగా పేదరికాన్ని రూపుమాపనివ్వడం లేదన్నారు. ఈ అంతరాలను పరిష్కరించడానికే తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని రూపొందించిందని వివరించారు. ఈ సమగ్ర విద్యావిధానం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని తెలిపారు.
ఇందులో 105 క్యాంపస్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్లు, విద్యారంగంలో అనుబంధ పెట్టుబడులకు రూ.9 వేల కోట్లు అంచనా వేశామన్నారు. ‘‘ఒక్కో స్కూల్లో 5 నుంచి12 తరగతుల వరకు దాదాపు 2,560 మంది విద్యార్థులు ఉంటారు. దాదాపు 2.7 లక్షల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతారు. అందువల్ల ఈ స్కూల్స్ కు ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయింపును ఇస్తే.. నిధుల సమీకరణకు మార్గం సగమం అవుతుంది” అని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అందించాలని కోరారు.
లోన్లను రీస్ట్రక్చర్ చేయండి..
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తెచ్చిన లోన్లను రీస్ట్రక్చర్ చేయాలని నిర్మల సీతారామన్ను కోరినట్టు భట్టి తెలిపారు. ఆమెతో భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అధిక వడ్డీతో తీసుకున్న రుణాల పరిమితిని సడలించాలని కోరినట్టు చెప్పారు. ఇందుకోసం లోన్ రీస్ట్రక్చరింగ్ చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.
‘‘రాష్ట్రంలో పామాయిల్ పెద్ద మొత్తంలో సాగువుతున్నది. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకం సమస్యగా మారింది. ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ. 25 వేల కనీస మద్దతు ధర కల్పించేలా దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని మంత్రిని కోరాం. తద్వారా రాష్ట్రంలో పామాయిల్ సాగు పెరిగి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడుతుంది” అని అన్నారు