
- బురద చల్లడం ఆపి.. ఓటమిపైసమీక్షించుకోండి
- అధికారంలో ఉన్నప్పుడుసెక్రటేరియెట్ పోలే, ప్రజల్ని కలువలే
- ఇప్పుడు కార్యకర్తల్నే ఫామ్హౌస్కురమ్మంటున్నరని విమర్శ
హైదరాబాద్, వెలుగు: అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్ ఎస్ పార్టీ పెద్దలు ఇప్పటికీ భ్రమల లోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల భంగపాటు తర్వాత లోపం ఎక్కడుందో సమీక్షించుకోవాల్సింది పోయి, ప్రభుత్వంపై బురద చల్లడంపైనే దృష్టి పెట్టారని ధ్వజమెత్తారు.
ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూపితే స్వాగతిస్తాం.. నిస్పృహతో కూడిన ప్రకటనలతో గందరగోళాన్ని సృష్టిస్తే ప్రజయోజనం ఉండదన్నారు. రాజకీయ పార్టీల గెలుపు, ఓటములను ప్రజలే నిర్ణయిస్తారు. వారి అభిమానం ఉన్నంతకాలమే ఏ రాజకీయ పక్షమైనా కొనసాగుతుంది. ఇంత జరిగినా పార్టీ అధినేత కేసీఆర్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు సెక్రటేరియెట్వెళ్లకుండా ఇంటి నుంచే పాలన సాగించారు. ఎన్నికల్లో తిరస్కరణకు గురైన తర్వాత కనీసం ప్రతిపక్ష నేతగానైనా జనం మధ్యకు వెళ్తారనుకున్నాం... కానీ ఇంట్లోనే కూర్చొని, బీఆర్ఎస్ కార్యకర్తలను తనవద్దకు రప్పించుకుంటున్నారని కేసీఆర్ తీరుపై శ్రీధర్ బాబు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ యాదృచ్ఛికంగా అధికారంలోకి వచ్చిందని ఇప్పటికీ ప్రచారం చేస్తుండటం వాళ్ల ఆలోచనలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిసిపోతోందని శ్రీధర్బాబు విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలు గెల్చుకుంది. బీఆర్ఎస్ కు దక్కింది కేవలం39 మాత్రమే. తమకు 25 సీట్ల ఆధిక్యత ఉందనే విషయాన్ని మరిచిపోతున్నారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 2019 లో తొమ్మిది సీట్లు గెల్చిన ఆ పార్టీ, ఇప్పుడు సున్నాకే పరిమితమైంది. ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదా? అయినా ఓటమితో దిష్టి తొలిగిందని సమర్థించుకోవడం ఏంటని నిలదీశారు. మళ్లీ అధికారంలోకి వచ్చి 15 ఏండ్లు అధికారంలో ఉంటామని గాంభీర్యాలకు పోవడం కలల్లో జీవించడం కాదా.. అని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్న పార్టీ.. ప్రజలకు ఏలోటు రాకుండా చూసుకుని మళ్లీ తామే గెలుస్తామని అనడంలో హేతుబద్ధత ఉంది. నేలమట్టమైన పార్టీని నాలుగున్నరేండ్ల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి 15 ఏండ్లు నిరాటంకంగా పరిపాలిస్తారనడం.. తార్కికతకు దగ్గరగా లేని అందమైన ఊహ అని అనుకోవాలని అందులో కేసీఆర్ ను ఉద్దేశించి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.