శ్రావణి ఆత్మహత్యకు కారణం దేవరాజ్ ​మెసేజ్​​?

శ్రావణి ఆత్మహత్యకు కారణం దేవరాజ్ ​మెసేజ్​​?

పెండ్లికి నో చెప్పి బ్లాక్ మెయిల్ చేయడంపై సాక్ష్యాలు

ఆదివారం సాయికృష్ణ విచారణ.. స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగుటీవీ ఆర్టిస్టు శ్రావణి ఆత్మహత్య కేసులో సస్పెన్స్ వీడింది. శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్‌‌రెడ్డి వేధింపులే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. పెండ్లికి అతను నిరాకరించడంతో పాటు బ్లాక్‌‌ మెయిల్‌‌ చేయడం వల్లే శ్రావణి సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆమెతో పరిచయం ఉన్న సాయికృష్ణ నుంచి ఆదివారం కీలక వివరాలు రాబట్టారు. శ్రావణితో సాయికృష్ణ ఫ్రెండ్‌‌ షిప్‌‌ దగ్గర్నుంచి దేవరాజ్‌‌రెడ్డి, శ్రావణి మధ్య ప్రేమ.. కుటుంబ గొడవల గురించి తెలుసుకున్నారు. ఈ నెల 7న పంజాగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్‌‌లో జరిగిన గొడవ.. ఆ తరువాత జరిగిన ఘటనలపై స్టేట్‌‌మెంట్‌‌ రికార్డు చేశారు.

టిక్‌‌టాక్‌‌తో ట్రాప్‌‌ చేశాడు: సాయికృష్ణ

శ్రావణికి దేవరాజ్‌‌రెడ్డి టిక్‌‌టాక్‌‌లో పరిచయమైనట్లు పోలీసులకు సాయికృష్ణ తెలిపాడు. డబ్బు కోసమే ఆమెను దేవరాజ్‌‌రెడ్డి ట్రాప్‌‌ చేశాడని చెప్పాడు. దేవరాజ్‌‌రెడ్డికి ఇతర అమ్మాయిలతో సంబంధాలు ఉన్నట్లు ఫొటోలు, వీడియోలను పోలీసులకు అందించినట్లు తెలిసింది. దేవరాజ్‌‌రెడ్డి వ్యవహారం తెలిసిన శ్రావణి.. ఫ్యామిలీతో కలిసి జూన్‌‌లో పోలీసులకు ఫిర్యాదు చేశామని సాయికృష్ణ తెలిపాడు.

మానసికంగా కుంగిపోయి..

శ్రావణి కేసు పెట్టాక దేవరాజ్‌‌రెడ్డి వేధింపులు పెరిగిపోయాయని పోలీసులకు సాయికృష్ణ చెప్పాడు. ఈ క్రమంలో సాయికృష్ణను పెండ్లి చేసుకోవాలని శ్రావణి ఫ్యామిలీ ఆమెపై ఒత్తిడి పెంచారు. మరోవైపు దేవరాజ్‌‌రెడ్డి పెండ్లికి నో చెబుతూ బ్లాక్‌‌మెయిల్‌‌ చేయడంతో శ్రావణి మానసికంగా కుంగిపోయినట్లు విచారణలో తేలింది. ఈ నెల 9న కూడా దేవరాజ్‌‌రెడ్డి, శ్రావణి మధ్య గొడవ జరిగిందని తెలిసింది. ఆత్మహత్యకు ముందు శ్రావణికి దేవరాజ్‌‌రెడ్డి చేసిన మెసేజ్‌‌తోనే ఆమె సూసైడ్‌‌ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. దేవరాజ్‌‌ను సోమవారం కోర్టులో ప్రొడ్యూస్‌‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

శ్రావణి కాల్‌‌ డేటా కీలకం

ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌‌రెడ్డి కన్ఫెషన్‌‌ స్టేట్‌‌మెంట్‌‌ను పోలీసులు రికార్డ్‌‌ చేశారు. దేవరాజ్‌‌రెడ్డి వేధింపులే సూసైడ్‌‌కు ప్రధాన కారణమని శ్రావణి ఆత్మహత్య చేసుకున్న రోజు కాల్‌‌ డేటా ఆధారంగా గుర్తించారు. పెండ్లికి దేవరాజ్‌‌ నో చెప్పడంతో పాటు ఆమెను బ్లాక్‌‌మెయిల్‌‌ చేసినట్లు సమాచారం సేకరించారు. దేవరాజ్‌‌ కంటే ముందే శ్రావణితో సాయికృష్ణకు ప్రేమ వ్యవహారం ఉందని గుర్తించారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులకు సాయికృష్ణ దగ్గరైనట్లు తెలుసుకున్నారు.