యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
  • ధర్మదర్శనానికి 4, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం
  • ఆదివారం ఒక్కరోజే రూ.74.33 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. హైదరాబాద్‌‌తో సహా పలు జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపాలు, పార్కింగ్ ప్రదేశం, బస్ బే ఏరియా, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ పరిసరాలు కిటకిటలాడాయి. రద్దీ కారణంగా నారసింహుడి ధర్మదర్శనానికి నాలుగు గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొండపైన, కింద పార్కింగ్‌‌ ప్లేస్‌‌లు పూర్తిగా నిండిపోవడంతో రింగ్‌‌ రోడ్డు వెంట వాహనాలను పార్క్‌‌ చేశారు.

భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఒక్కరోజే ఆలయానికి రూ.74,33,486 ఆదాయం సమకూరింది. ఇందులో అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.24,07,390, వీఐపీ దర్శనాల ద్వారా రూ.16.50 లక్షలు, ప్రధాన బుకింగ్‌‌తో రూ.9,87,600, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.7,70,500, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.6,77,700, యాదరుషి నిలయం ద్వారా రూ.4,33,810, సత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.2.92 లక్షలు, లీజెస్ ద్వారా రూ.3,22,661, కల్యాణకట్ట ద్వారా రూ.1.65 లక్షల ఇన్‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.

అపరిశుభ్రతపై ఈవో అసహనం

యాదగిరిగుట్ట ఈవో వెంకటరావు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకే ఆలయ పరిసరాలు, మాడవీధులు, ప్రధానాలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. కొండపైన అపరిశుభ్రత నెలకొనడంతో అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్‌‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ రాత్రి ఆలయం మూసి వేయగానే క్లీనింగ్‌‌ పనులు చేయించాలని సంబంధిత కాంట్రాక్టర్, సూపర్‌‌వైజర్లను ఆదేశించారు. తెల్లవారుజామున 4 గంటల్లోపే క్లీనింగ్‌‌ పనులు పూర్తి కావాలని, లేకపోతే కాంట్రాక్ట్‌‌ రద్దు చేస్తామని హెచ్చరించారు.