
రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్ సీఎం కేసీఆర్ను కలిశారు. తనకు డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్కు కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీకి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు అంజనీకుమార్ రాష్ట్ర కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్.. అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వరంగల్ జిల్లా జనగామ ఏఎస్పీగా తొలి పోస్టింగ్ పొందారు. ఆ తరువాత మహబూబ్నగర్, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. 1998లో ఐక్య రాజ్య సమితి శాంతిపరిరక్షక దళానికి ఎంపికై బోస్నియా-హెర్జిగోవినాలో సంవత్సరంపాటు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన రెండుసార్లు ఐక్యరాజ్యసమితి శాంతి పతకాన్ని అందుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్గా, గ్రేహౌండ్స్ చీఫ్గా, నిజామాబాద్ రేంజ్ల డీఐజీగా, వరంగల్ ఐజీగా, హైదరాబాద్ ఏసీపీగా, సీపీగా, ఏసీబీ డీజీగా వివిధ హోదాల్లో అంజనీకుమార్ పని చేశారు.