
హైదరాబాద్, వెలుగు: ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద విమానయాన సంస్థ, ఇథియోపియన్ ఎయిర్లైన్స్ హైదరాబాద్కు నేరుగా ప్యాసింజర్ సర్వీస్ మొదలుపెట్టింది. ఇది వారానికి మూడుసార్లు నడుస్తుంది. ఈ కొత్త మార్గం ద్వారా ఆఫ్రియా, భారతదేశాల మధ్య కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని కంపెనీ తెలిపింది. ఆడిస్ అబాబా– హైదరాబాద్ (ఈటీ 682) విమానం సోమ, బుధ, శనివారాల్లో, హైదరాబాద్– ఆడిస్ అబాబా (ఈటీ 683) విమానం - మంగళ, గురు, శనివారాల్లో నడుస్తుంది.
ఈ కొత్త మార్గాన్ని అధికారికంగా ప్రారంభించిన సందర్భంగా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ గ్రూప్ సీఈఓ మెస్ఫిన్ తస్యూ హైదరాబాద్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. “హైదరాబాద్కు మా కొత్త సర్వీసును ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా విమానాలు నేరుగా వెళ్లే ఆరో భారతీయ నగరం ఇదే అవుతుంది.
విమాన సర్వీసులు అందించడంతో పాటు ఈ కొత్త విమానం ఇరు దేశాల మధ్య వాణిజ్య, పర్యాటక బంధాలను బలోపేతం చేయడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుందని మేం బలంగా నమ్ముతున్నాం”అని ఆయన అన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై నగరాలకు ఇథియోపియన్ ఎయిర్లైన్స్ వారానికి 50కి పైగా ప్రయాణికుల, కార్గో విమాన సర్వీసులు నడిపిస్తోంది.