రాజస్థాన్ బిల్లు మంచికేనా..?

రాజస్థాన్ బిల్లు మంచికేనా..?

దండు దాడుల కల్చర్​ దేశంలో కొత్తగా ప్రవేశించింది. ఈ వయొలెన్స్​కి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు, మోడీ సర్కారు గతంలోనే ఆదేశించాయి. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు యాంటీ–లించింగ్​ చట్టాలు చేశాయి. వీటిలో మొదటిది మణిపూర్​ కాగా, రెండోది రాజస్థాన్​. అయితే రాజస్థాన్​ తీసుకొచ్చిన ఈ చట్టం పట్ల అక్కడి ప్రతిపక్షమైన బీజేపీ అభ్యంతరం చెప్పింది. ఆ చట్టం గోహంతకులను ప్రోత్సహించేలా ఉందని విమర్శించింది. అశోక్​ గెహ్లాట్​ నాయకత్వంలోని కాంగ్రెస్​ గవర్నమెంట్​ ‘రాజస్థాన్​ ప్రొటెక్షన్​ ఫ్రం లించింగ్​ బిల్లు–2019’ని ఓకే చేయించుకోవటం వెనుక కనిపించని ఉద్దేశాలున్నాయని బీజేపీ ఆరోపించింది. ఒక మతానికి చెందినవారిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నించిందన్నది ప్రధాన అభ్యంతరం. దండు దాడులను అరికట్టాలనే ఉద్దేశం​ గెహ్లట్​ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ప్రతిపక్షం గగ్గోలు పెడుతోంది. మూగ జీవాలను అక్రమంగా రవాణా చేసే​వాళ్లకు ముకుతాడు వేయకుండా ప్రొటెక్షన్​ కల్పిస్తోందని పేర్కొంది. దండు దాడుల విషయంలో మోడీ గవర్నమెంట్ అనుసరించిన విధానాన్నే స్థానిక నాయకత్వం కూడా పాటించింది. ​

హస్తం పార్టీ రూపొందించి, ఆమోదం తెలిపిన ఈ బిల్లును సెలెక్ట్​ కమిటీకి పంపాలని డిమాండ్​ చేసినా పట్టించుకోలేదు. పరువు హత్యల నివారణ కోసం తెచ్చిన మరో బిల్లు విషయంలోనూ గులాబ్​ చంద్​ కటారియా లీడర్​షిప్​లోని ప్రధాన ప్రతిపక్షం తన అభిప్రాయాలను క్లియర్​కట్​గా చెప్పేసింది. ఆనర్​ కిల్లింగ్స్​కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ‘రాజస్థాన్​ ప్రొహిబిషన్ ఆఫ్​ ఇంటర్​ఫియరెన్స్​ విత్​ ది ఫ్రీడం ఆఫ్​ మ్యాట్రిమోనియల్​ ఇన్​ ద నేమ్​ ఆఫ్​ ఆనర్​ అండ్​ ట్రెడిషన్​ బిల్లు–2019’కి రూపకల్ప చేసింది.

పరువు హత్యల  కేసులను ఖాప్​ పంచాయతీలు డీల్​ చేస్తుంటాయి. చట్టాలతోనూ, కోర్టులతోనూ సంబంధం లేకండా ఖాప్​ పంచాయతీలే శిక్షలు ఖరారు చేస్తుంటాయి. ఖాప్​ పంచాయతీల వల్ల స్థానికుల వ్యక్తిగత స్వేచ్ఛకి ఆటంకం ఏర్పడుతోందని బీజేపీ అంటోంది.  తీర్పు చెప్పే సందర్భాల్లో గ్రామ పెద్దలు స్వార్థంతో కొందరిపై అర్థంపర్థంలేని వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటారు .ఇది గ్రామంలో కమ్యూనల్​ హార్మనీని దెబ్బతీస్తోందని గతంలో కోర్టులు స్పష్టం చేశాయి. పరువు హత్యల విషయంలో ఇప్పటికే దేశమంతా అలజడి రేగుతోంది.​

ఇండియన్​ పీనల్​ కోడ్​ (ఐపీసీ)లోని రూల్స్​కి వ్యతిరేకంగా జరుగుతున్న హత్యలకు ఫుల్​స్టాప్​ పెట్టేందుకే తాము ఈ రెండు బిల్లుల్ని తెచ్చామని గెహ్లాట్​ చెబుతున్నారు. గోవులను అక్రమం​గా తరలిస్తున్నారన్న కారణంతో చాలాచోట్ల ట్రాన్స్​పోర్టు లారీలను ఆపేయడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రూమర్స్​వల్ల జనం ఉద్రేకపడి చేయి చేసుకోవడం లేదా దండు దాడులకు దిగడం మామూలై పోయింది.  దీనిలో మత కోణంకూడా ఉండడంతో సమస్య సున్నితంగా మారింది. ఇటువంటి రెచ్చగొట్టే చర్యలను ప్రతిఘటించాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండడం లేదంటున్నారు సోషల్​ యాక్టివిస్టులు.  ఈ ఇన్సిడెంట్లలో బాధితులు మైనారిటీ కమ్యూనిటీలకు చెందినవాళ్లవుతున్నారు.అల్లరి మూకలు చట్టాలను చేతుల్లోకి తీసుకోవటం వల్ల తలెత్తుతున్న చెడు పరిణామాలివి. అట్టడుగు వర్గాలను పొట్టన పెట్టుకుంటున్న ఇలాంటి లించింగ్​లకు చెక్​ పెట్టడానికి సెపరేట్​ చట్టాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు ఇటీవల మరోసారి గుర్తుచేసింది.