అక్రెడిటేషన్ కార్డుల జీవోను సవరించాలి : డీజేఎఫ్టీ

అక్రెడిటేషన్ కార్డుల జీవోను సవరించాలి : డీజేఎఫ్టీ
  • డెస్క్​ జర్నలిస్టులకూ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి: డీజేఎఫ్​టీ  

హైదరాబాద్, వెలుగు: వర్కింగ్​జర్నలిస్టులలో విభజనను తీసుకొచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డెస్క్​ జర్నలిస్ట్స్ ఫెడరేషన్​ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్​టీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అక్రెడిటేషన్ కార్డుల విషయంలో డెస్క్​ జర్నలిస్టులు, రిపోర్టర్లను వేరు చేసేలా ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవడం సహేతుకం కాదని పేర్కొంది. అక్రెడిటేషన్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన  జీవో 252ను సవరించాలని ప్రభుత్వానికి డీజేఎఫ్ టీ విజ్ఞప్తి చేసింది. డెస్క్​జర్నలిస్టులకు బస్ పాసుల విషయమై ఐ అండ్ పీఆర్ అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. 

బుధవారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డెస్క్​ జర్నలిస్ట్స్ ఫెడరేషన్​ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్ టీ) కొత్తగా ఏర్పాటైంది. డీజేఎఫ్​టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాదిని ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా మస్తాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెజరర్​గా నిస్సార్, ఉపాధ్యక్షుడిగా కేవీ రాజారామ్, జాయింట్ సెక్రటరీగా విజయ ఎన్నికయ్యారు. అనంతరం డెస్క్​ జర్నలిస్టుల సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. డెస్క్​ జర్నలిస్టులకు అక్రెడిటేషన్​ కార్డులు ఇవ్వబోమని, మీడియా కార్డుల పేరిట కొత్తగా కార్డులు జారీ చేస్తామని చెప్పడం సరికాదన్నారు. 

అక్రెడిటేషన్​ కార్డులు, మీడియా కార్డులకు ఒకే రకమైన సంక్షేమ పథకాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారని.. అలాంటప్పుడు రెండు కార్డులు తీసుకురావాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నించారు. గతంలో ఇచ్చినట్టు వర్కింగ్​ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హెచ్​యూజే అధ్యక్ష, కార్యదర్శులు బి.అరుణ్​ కుమార్, బి.జగదీశ్, టీడబ్ల్యూజేఎఫ్​ ఉపాధ్యక్షుడు బి.రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి నవీన్, డబ్ల్యూఐజే రాష్ట్ర సెక్రటరీ రావికంటి శ్రీనివాస్, పలువురు సీనియర్ రిపోర్టర్లు పాల్గొని మద్దుతు ప్రకటించారు.