
హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోఠిలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వద్ద డాక్టర్లు బుధవారం ఆందోళనకు దిగారు. టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు డీఎంఈ ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి తరలివచ్చారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వడంతో డీఎంఈ ఆఫీసు ఎదుట శాంతియుతంగా ధర్నా చేసి, తమ నిరసన తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు.
పీఆర్సీ బకాయిల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నామని డాక్టర్లు మీడియాతో అన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో డీఎంఈ ఆఫీస్ ముట్టడించాలని నిర్ణయించుకున్నామన్నారు. 2016 నుంచి పీఆర్సీ ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయని, 2018 నుంచి డాక్టర్ల బదిలీలు చేపట్టకపోవటంతో డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే జనరల్ ట్రాన్స్ఫర్లు చేయాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ , వైద్య విధాన పరిషత్ పరిధి నుంచి డీఎంఈ పరిధిలోకి వచ్చిన డాక్టర్ల పే ఫిక్సేషన్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సమస్యలు అన్నింటినీ ఇదివరకే చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లామని, ఇంకో వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని డాక్టర్లు హెచ్చరించారు. అన్వర్, తిరుపతిరావు, కిరణ్ మాదాల, కిరణ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.