శివశక్తి ఫౌండేషన్‌కు  విరాళాలు ఇవ్వొద్దు

శివశక్తి ఫౌండేషన్‌కు  విరాళాలు ఇవ్వొద్దు

హైదరాబాద్‌లోని శివశక్తి ఫౌండేషన్‌పై సినీ నటి కరాటే కళ్యాణి తీవ్ర ఆరోపణలు చేశారు. శివశక్తి ఫౌండేషన్ ఓ దుష్టశక్తి అని అభివర్ణించారు. అమాయక హిందువుల నుంచి ఈ ఫౌండేషన్ విరాళాలను సేకరిస్తోందని.. వాటిని సొంత అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. శివశక్తి ఫౌండేషన్‌లో పాత సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి నిధులను దారి మళ్లించారన్నారు. శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం ఏర్పాటుకు రెండున్నర కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేశారన్నారు.


శివశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు కరుణాకర్ సుగ్గున, డైరెక్టర్లు దేవిరెడ్డి ఆనందకుమార్ రెడ్డి, సునీతారెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని నటి కరాటే కళ్యాణి విమర్శలు చేశారు. శివశక్తి ఫౌండేషన్‌లో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తనను ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శివశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు, డైరెక్టర్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. శివశక్తి ఫౌండేషన్ అక్రమాలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కరాటే కళ్యాణి తెలిపారు. శివశక్తి ఫౌండేషన్‌కు హిందువులు ఎవరూ విరాళాలు ఇవ్వొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.