జైపూర్లో వైరల్ అయిన పింక్ ఎలిఫెంట్ (గులాబీ ఏనుగు) మరణ వార్త సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. నవంబర్ 2025లో జైపూర్లోని ఒక పాత దేవాలయంలో ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ ఫోటోషూట్ నిర్వహించారు. ఇందులో 'చంచల్' అనే ఏనుగుకు ఒళ్లంతా గులాబీ రంగు పూసి, దాని పై ఒక మోడల్తో ఫోటోలు తీయించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, అదే సమయంలో ఆ ఏనుగు అనారోగ్యానికి గురై చనిపోవడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
చంచల్ ఎవరు
చంచల్ జైపూర్లోని 'హతి గావ్' అనే ఏనుగుల గ్రామంకి చెందిన ఒక ఆడ ఏనుగు. దీని వయస్సు సుమారు 70 ఏళ్లు. ఏనుగుల జీవితకాలం దృష్ట్యా ఇది చాలా ఎక్కువ వయస్సు. ఇక్కడ స్థానిక సంరక్షకులు దీనిని ఎంతో కాలంగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
మరణానికి కారణం
ఈ ఏనుగు మరణంపై రెండు రకాల కారణాలు చెబుతన్నారు. నెటిజన్ల ఆరోపణ ఏంటంటే అందం కోసం ఏనుగుకు రంగులు పూయడం వల్లే అది అనారోగ్యానికి గురై చనిపోయిందని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల వివరణ చూస్తే చంచల్ వయస్సు పైబడటం (70 ఏళ్లు) వల్ల సహజంగానే మరణించిందని అధికారులు చెబుతున్నారు. ఫోటోషూట్ సమయంలో వాడింది సహజసిద్ధమైన రంగులేనని, షూటింగ్ ముగియగానే రంగును కడిగేశారని వారు స్పష్టం చేశారు.
►ALSO READ | పని లేకుండా జీతం తీసుకోవడం కూడా అవినీతే: పోస్టింగ్ ఇవ్వలేదని ఐఏఎస్ పదవికి రాజీనామా..
ప్రస్తుతం ఈ ఘటనపై ప్రజల్లో ఆందోళన పెరగడంతో రాజస్థాన్ అటవీ శాఖ రంగంలోకి దిగింది. అసలు ఈ ఫోటోషూట్కు అనుమతులు ఉన్నాయా ? జంతువుల సంరక్షణ నిబంధనలు పాటించారా.. లేదా.. ? అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
చంచల్ మరణం దురదృష్టకరమే అయినా, అది వయస్సు రీత్యా జరిగిందని ఒక వర్గం అంటుంటే.. మూగజీవాలను ఇలాంటి ప్రయోగాలకు వాడకూడదని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
