
- కంపెనీలపై ఒత్తిడి తెచ్చి మరీ ఒప్పందం.. పూర్తిగా రెడీకాక ముందే ఆర్డర్లు
- ఇట్లయితే పేద దేశాలకు తిప్పలే: డబ్ల్యూహెచ్వో
జొహెన్నెస్బర్గ్: కరోనా వ్యాక్సిన్ ను ధనిక దేశాలే ఎగరేసుకుపోతున్నాయని అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీ రీసెర్చ్ వెల్లడించింది. వ్యాక్సిన్ కొనుగోలులో ధనిక దేశాలు ముందున్నాయని, పేద దేశాలు వెనకబడ్డాయని తెలిపింది. తమ సిటిజన్లు అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు పెద్ద మొత్తంలో, అడ్వాన్స్గా ఆర్డర్ చేశాయని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ దశలో ఉన్నప్పుడే ఈ తతంగం పూర్తయిందని చెప్పింది. ఇందుకోసం వ్యాక్సిన్ తయారీ కంపెనీలపై ఒత్తిడి తెచ్చాయని వెల్లడించింది. ఇట్ల అడ్వాన్స్ ఆర్డర్ చేసిన దేశాల్లో అమెరికా, బ్రిటన్ ముందున్నాయని, తమ దేశాల్లోని పౌరులు ఒక్కొక్కరికీ ఐదు డోసుల చొప్పున బుక్ చేసుకున్నాయని డ్యూక్ వర్సిటీ రీసెర్చర్లు చెప్పారు.
ప్రపంచ జనాభాలో ధనిక దేశాల పాపులేషన్ 13 శాతం కాగా 50 శాతం వ్యాక్సిన్ డోసులను ఆయా దేశాలే ప్రీ బుకింగ్చేసుకున్నాయని అన్నారు. ధనిక దేశాలు మొదలెట్టిన వ్యాక్సిన్ ప్రీ ఆర్డర్ కారణంగా వ్యాక్సిన్ ధరలు పెరిగి, ఆ ప్రభావం పేద దేశాలపై పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, పేద దేశాలకు వ్యాక్సిన్ చేరాలంటే చాలా కాలం పడుతుందని పేర్కొంది.
రికార్డు టైమ్లో వ్యాక్సిన్ తయారీ..
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి సైంటిస్టులు రికార్డు టైమ్లో వ్యాక్సిన్తయారు చేశారు. తయారీలో వేగంతో పాటు ప్రాసెస్ను కుదించడంతో ఎట్టకేలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఎమర్జెన్సీ వాడకంలో భాగంగా ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సిన్ను ఉపయోగిస్తుండగా.. పూర్తిస్థాయిలో రెడీ అయిన వ్యాక్సిన్ వాడకాన్ని ఇటీవలే యూకే అధికారికంగా ప్రారంభించింది. అయితే, కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో డబ్ల్యూహెచ్వో ముందు నుంచే ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. పేద దేశాలు వివక్షను ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొంది. వ్యాక్సిన్ అన్ని దేశాలకు సమానంగా అందాలని, అప్పుడే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని చెప్పింది.
దేశాల వారీగా వ్యాక్సిన్ల ఆర్డర్లు..
అమెరికా 240 కోట్ల డోసులు, యూరోపియన్ యూనియన్ 206.5 కోట్ల డోసులు, బ్రిటన్ 38 కోట్ల డోసులు, కెనడా 33.8 కోట్ల డోసులు, ఇండోనేషియా 32.8 కోట్ల డోసులు, చైనా 30 కోట్ల డోసులు, జపాన్ 29 కోట్ల డోసుల వ్యాక్సిన్ను ప్రి బుకింగ్ చేసుకున్నాయి. ప్రపంచంలోని పేద దేశాలన్నింటికీ కలిపి కేవలం 320 కోట్ల డోసులను కేటాయించారు.