కరోనా వ్యాక్సిన్ పై ధనిక దేశాల డామినేషన్​

కరోనా వ్యాక్సిన్ పై ధనిక దేశాల డామినేషన్​
  • కంపెనీలపై ఒత్తిడి తెచ్చి మరీ ఒప్పందం.. పూర్తిగా రెడీకాక ముందే ఆర్డర్లు
  • ఇట్లయితే పేద దేశాలకు తిప్పలే: డబ్ల్యూహెచ్​వో

జొహెన్నెస్బర్గ్: కరోనా వ్యాక్సిన్ ను ధనిక దేశాలే ఎగరేసుకుపోతున్నాయని అమెరికాకు చెందిన డ్యూక్​ యూనివర్సిటీ రీసెర్చ్​ వెల్లడించింది. వ్యాక్సిన్​ కొనుగోలులో ధనిక దేశాలు ముందున్నాయని, పేద దేశాలు వెనకబడ్డాయని తెలిపింది. తమ సిటిజన్లు అందరికీ వ్యాక్సిన్​ అందించేందుకు పెద్ద మొత్తంలో, అడ్వాన్స్​గా ఆర్డర్​ చేశాయని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ దశలో ఉన్నప్పుడే ఈ తతంగం పూర్తయిందని చెప్పింది. ఇందుకోసం వ్యాక్సిన్​ తయారీ కంపెనీలపై ఒత్తిడి తెచ్చాయని వెల్లడించింది.  ఇట్ల అడ్వాన్స్ ఆర్డర్​ చేసిన దేశాల్లో అమెరికా, బ్రిటన్​ ముందున్నాయని, తమ దేశాల్లోని పౌరులు ఒక్కొక్కరికీ ఐదు డోసుల చొప్పున బుక్​ చేసుకున్నాయని డ్యూక్​ వర్సిటీ రీసెర్చర్లు చెప్పారు.

ప్రపంచ జనాభాలో ధనిక దేశాల పాపులేషన్​ 13 శాతం కాగా 50 శాతం వ్యాక్సిన్​ డోసులను ఆయా దేశాలే ప్రీ బుకింగ్​చేసుకున్నాయని అన్నారు. ధనిక దేశాలు మొదలెట్టిన వ్యాక్సిన్  ప్రీ ఆర్డర్​ కారణంగా వ్యాక్సిన్​ ధరలు పెరిగి, ఆ ప్రభావం పేద దేశాలపై పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, పేద దేశాలకు వ్యాక్సిన్​ చేరాలంటే చాలా కాలం పడుతుందని పేర్కొంది.

రికార్డు టైమ్​లో వ్యాక్సిన్​ తయారీ..

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి సైంటిస్టులు రికార్డు టైమ్​లో వ్యాక్సిన్​తయారు చేశారు. తయారీలో వేగంతో పాటు ప్రాసెస్​ను కుదించడంతో ఎట్టకేలకు వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చింది. ఎమర్జెన్సీ వాడకంలో భాగంగా ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సిన్​ను ఉపయోగిస్తుండగా.. పూర్తిస్థాయిలో రెడీ అయిన వ్యాక్సిన్​ వాడకాన్ని ఇటీవలే యూకే  అధికారికంగా ప్రారంభించింది. అయితే, కరోనా వ్యాక్సిన్​ పంపిణీ విషయంలో డబ్ల్యూహెచ్​వో ముందు నుంచే ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. పేద దేశాలు వివక్షను ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొంది. వ్యాక్సిన్​ అన్ని దేశాలకు సమానంగా అందాలని, అప్పుడే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని చెప్పింది.

దేశాల వారీగా వ్యాక్సిన్ల ఆర్డర్లు..

అమెరికా 240 కోట్ల డోసులు, యూరోపియన్​ యూనియన్​ 206.5 కోట్ల డోసులు, బ్రిటన్​ 38 కోట్ల డోసులు, కెనడా 33.8 కోట్ల డోసులు, ఇండోనేషియా 32.8 కోట్ల డోసులు, చైనా 30 కోట్ల డోసులు, జపాన్​ 29 కోట్ల డోసుల వ్యాక్సిన్​ను ప్రి బుకింగ్​ చేసుకున్నాయి. ప్రపంచంలోని పేద దేశాలన్నింటికీ కలిపి కేవలం 320 కోట్ల డోసులను కేటాయించారు.