ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్.. ఫలించిన ట్రంప్ మధ్యవర్తిత్వం

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్.. ఫలించిన ట్రంప్ మధ్యవర్తిత్వం
  • కాల్పుల విరమణకు అంగీకరించినట్టు రెండు దేశాల ప్రకటనలు 
  • కాసేపటికే మళ్లీ మొదలైన మిసైల్ దాడులు 
  • ఇరు దేశాలపై అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం  
  • ఇజ్రాయెల్ తీరుపై తీవ్ర అసహనం 
  • ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించిందన్న ఇజ్రాయెల్.. తాము ముందుగా దాడి చేయలేదన్న ఇరాన్  
  • దాడి గురించి ముందే చెప్పినందుకు ఇరాన్‎కు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్ 

వాషింగ్టన్ / టెహ్రాన్ / టెల్ అవీవ్:  ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల యుద్ధం ముగిసిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య మంగళవారం ఉదయం 9.30 గంటల (ఇండియన్ టైం ప్రకారం) నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిందని వెల్లడించారు. అమెరికా మధ్యవర్తిత్వంతోనే సీజ్ ఫైర్ అమలులోకి వచ్చిందని, ఇకపై రెండు దేశాలూ కాల్పుల విరమణను ఉల్లంఘించొద్దని కోరారు. అయితే, ట్రంప్ ప్రకటన తర్వాత సీజ్ ఫైర్ ఒప్పందానికి అంగీకరించినట్టు అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ ప్రకటించాయి. కానీ ఆ తర్వాత మూడు గంటలు కూడా గడవకముందే మళ్లీ రెండు దేశాలు మిసైళ్లు, బాంబులతో దాడులు చేసుకున్నాయి.

దీంతో రెండు దేశాల తీరుపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ తీరు పట్ల చాలా అసంతృప్తితో ఉన్నానని ‘ట్రూత్ సోషల్’ వేదికగా పోస్ట్ పెట్టారు. కాగా, ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ.. కాల్పుల విరమణకు అంగీకరించామని తెలిపారు. అయితే, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము కూడా దాడులు ఆపుతామని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ లోని తమ లక్ష్యాలన్నింటినీ నాశనం చేశామని, దాడులు ఆపుతున్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత కాసేపటికే రెండు దేశాల మధ్య మిసైల్ దాడులు కొనసాగాయి.

ఇజ్రాయెల్ పై ట్రంప్ తీవ్ర అసహనం..

ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై ట్రంప్ మండిపడ్డారు. మంగళవారం ఉదయం ది హేగ్‏లో నాటో సమిట్‎కు వెళ్లే ముందు వైట్ హౌస్‎లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘వాళ్లు సీజ్ ఫైర్ ఉల్లంఘించారు. ముఖ్యంగా నేను ఇజ్రాయెల్ పట్ల సంతోషంగా లేను. మేం డీల్ కుదిర్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడం ఏమిటి..? ఏదో ఒక రాకెట్.. అది కూడా ఎక్కడో గాలిలోనే పేలిపోయిన విషయాన్ని పట్టుకుని.. ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసిందని విన్నా.

ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నా” అని ఆయన తెలిపారు. యుద్ధాన్ని ఆపాలని తాము చూస్తుంటే.. వాళ్లు ఏంచేస్తున్నారో వారికే తెలియడంలేదని సీరియస్ అయ్యారు. ‘‘ఇజ్రాయెల్. ఆ బాంబులు వేయొద్దు. మీరు దాడులు చేస్తే అది పెద్ద ఉల్లంఘనే అవుతుంది. మీ పైలట్లను, విమానాలను వెంటనే తిరిగి రప్పించండి” అని సూచించారు.

3 గంటలు కూడా గడవకముందే..    

ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించడానికి ముందుగా ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం పెద్ద ఎత్తున దాడులు చేసుకున్నాయి. అలాగే ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించిన 3 గంటల తర్వాత కూడా ఇరాన్, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు షురూ చేశాయి. నార్తర్న్ ఇజ్రాయెల్ పైకి ఇరాన్ మిసైల్స్ ప్రయోగించడంతో ఆ ప్రాంతమంతా సైరన్ల మోత మోగింది. ఇరాన్ సీజ్ ఫైర్ ను ఉల్లంఘించిందని, ఆ దేశంపై ప్రతిదాడులు చేపట్టాలంటూ తమ బలగాలను ఆదేశించానని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కొద్దిసేపటికే టెహ్రాన్​లోనూ పేలుళ్లు సంభవించాయి.

 ఇరాన్ రెండు బాలిస్టిక్ మిసైల్స్​తో దాడి చేసినందుకే తాము ఇరాన్ రాడార్ సైట్​పై దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. కాల్పుల విరమణను ఇరాన్ ఉల్లంఘించినందున, అందుకు తమ నుంచి తగిన మేరకు ప్రతిస్పందించాల్సి రావడంతోనే దాడులు చేశామని ట్రంప్ కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. కాగా, సీజ్ ఫైర్ కు ముందు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 9 మంది పౌరులు చనిపోయారని ఇరాన్ నార్తర్న్ గిలాన్ ప్రావిన్స్ గవర్నర్ ప్రకటించారు. అలాగే ఎవిన్ ప్రిజన్ పై ఇజ్రాయెల్ సోమవారం దాడి చేసిన నేపథ్యంలో ఆ జైలు నుంచి ఖైదీలందరినీ టెహ్రాన్​లోని ఇతర జైళ్లకు తరలించామని అధికారులు తెలిపారు.

ఇరాన్‎కు ట్రంప్​ థ్యాంక్స్.. 

ఖతార్‎లోని ఎయిర్ బేస్‎పై దాడికి ముందు నోటీసు ఇచ్చినందుకుగాను ఇరా‎కు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఎయిర్ బేస్‎లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకునే వీలు కలిగిందన్నారు. ఇరాన్ మొత్తం 14 మిసైళ్ల ను ప్రయోగించగా, 13 క్షిపణులను కూల్చేశామ న్నారు. ఒక మిసైల్ మాత్రం పెద్దగా ప్రమాదం లేని దిశగా వచ్చినందుకు వదిలేశామని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.