డ్రగ్స్ విషయంలో నాపై దుష్ప్రచారాన్ని ఆపండి

డ్రగ్స్ విషయంలో నాపై దుష్ప్రచారాన్ని ఆపండి

ముంబై: డ్రగ్స్ కేసు విషయంలో తనపై మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ అన్నాడు. హౌజ్ పార్టీలో తాను నార్కోటిక్స్‌‌ను వినియోగించానన్న ఆరోపణలను ఆయన ఖండించాడు. సదరు ఆరోపణలు నిరాధారమని, అబద్ధాలుగా కొట్టిపారేశాడు. ‘2019, జూలై 28న నా ఇంట్లో నిర్వహించిన పార్టీలో నార్కోటిక్స్‌‌ను వినియోగించామని కొన్ని వార్తా చానళ్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్స్ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఇంతకు ముందే వివరణ ఇచ్చా. ఇవి పూర్తిగా నిరాధారమైనవని, అబద్ధాలని మరోసారి స్పష్టం చేస్తున్నా. డ్రగ్స్ వాడకాన్ని నేను ప్రోత్సహించను. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ నన్ను, నా కుటుంబీకులు, సహచరులు, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌ను లక్ష్యంగా చేసుకొని ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాయి’ అని కరణ్ పేర్కొన్నారు.