స్పౌజ్ ట్రాన్స్ ఫర్లు వెంటనే చేపట్టాలి : ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ వివేక్
ఖైరతాబాద్, వెలుగు: ‘ మా అమ్మానాన్నలను విడదీయొద్దు.. వారిని ఒకే జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేయండి.. మా తల్లిదండ్రులను కలపండి..’ అని బాలల దినోత్సవం రోజు టీచర్ల పిల్లలు మంత్రులు, ఆఫీసర్లను వేడుకున్నరు. తల్లిదండ్రులకు దూరమై తాము మానసికంగా తల్లడిల్లి పోతున్నమని, వాళ్లను ఒకే జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేయాలని సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్లకార్డులతో చిన్నారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీచర్స్ స్పౌజ్ ఫోరం ప్రెసిడెంట్ వివేక్ మాట్లాడుతూ.. ఎన్నో నెలలుగా తాము మానసిక ఒత్తిడితో పని చేస్తున్నామని, తమను ఒకే జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేయాలని విన్నవించారు.
పది నెలల నుంచి 13 జిల్లాల టీచర్ దంపతులు ట్రాన్స్ ఫర్ కోసం మంత్రి సబితతో పాటు పలువురు మంత్రులు, ఆఫీసర్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు రోడ్లమీదకి వచ్చి జిల్లా కేంద్రాల్లో హైదరాబాద్లో శాంతియుతంగా నిరసన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకుంటలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 13 జిల్లాల్లో 1,800 మంది టీచర్లు భార్య ఒక జిల్లాలో భర్త మరొక జిల్లాలో డ్యూటీలు చేస్తున్నారని, దీంతో వారి కుటుంబాలు ఆగమయ్యాయని చెప్పారు. వందల కిలో మీటర్లు ప్రయాణిస్తూ కష్టాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనైనా ప్రభుత్వం వెంటనే టీచర్ల స్పౌజ్ ట్రాన్స్ ఫర్లు చేయాలని విన్నవించారు.