ఏపీ.. ఈ నీటి ప్రాజెక్టులను వెంటనే ఆపేయాలి : బోర్డుకు లేఖ రాయనున్న తెలంగాణ

ఏపీ.. ఈ నీటి ప్రాజెక్టులను వెంటనే ఆపేయాలి : బోర్డుకు లేఖ రాయనున్న తెలంగాణ

విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఏపీ రూ.47,776.50 కోట్ల ప్రాజెక్టులను చేపట్టినా పట్టించుకోని కృష్ణా బోర్డు.. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై మాత్రం అక్కసు వెళ్లగక్కుతున్నదని ప్రభుత్వం మండిపడింది. శ్రీశైలం ఆధారంగా పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ ద్వారా కోటాకు మించి నీటి మళ్లింపులకు చేపడుతున్న ఎస్​ఆర్​బీసీ, తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, విభజన చట్టంలోని 84(3)(II), 85(8)(d) సెక్షన్లను ఉల్లంఘించి నిర్మిస్తున్నదని పేర్కొంది. కృష్ణా జలాలను వినియోగించుకునేలా కృష్ణా పరీవాహకంలోనే ఆ ప్రాజెక్టులపై ముందుకు వెళ్తున్నామని తెలిపింది. 

ఈ ప్రాజెక్టులను వెంటనే ఆపేయాలి..

ఏపీ 290 టీఎంసీల కృష్ణా జలాలను అవుట్​ సైడ్​ బేసిన్​కు తరలించేలా కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని లేఖలో ఈఎన్​సీ ఆరోపించారు. కర్నూలు, కడప జిల్లాల్లో తెలుగుగంగ కింద రెండో పంట కోసం 15 టీఎంసీలు, హంద్రీనీవా ఎక్స్​టెన్షన్​కు 6 టీఎంసీలు, హంద్రీనీవా కింద రెండో పంట కోసం 28 టీఎంసీలు, పరిశ్రమల అవసరాలు, చెరువులను నింపేందుకు, తాగునీటి కోసం 20.69 టీఎంసీలు, వెలిగొండ ప్రాజెక్టుకు 2.66 టీఎంసీలు, గాలేరు నగరి కింద రెండో పంట కోసం 26.6 టీఎంసీలు, గాలేరు నగరి లిఫ్ట్​కు 15.8 టీఎంసీల చొప్పున 114.75 టీఎంసీల తరలింపునకు ఏపీ ప్రాజెక్టులు చేపడుతున్నదని పేర్కొన్నారు. 

►ALSO READ | ప్రైవేట్ స్కూల్ ఫీజు.. 2 ఏళ్లకు 8 శాతం మాత్రమే పెంచాలి..!

వాటితో పాటు వరికపుడిశల స్కీమ్​ (ఫేజ్​ 1, 2) కింద 7.867 టీఎంసీలు, సాగర్​ కుడి కాల్వ ఎక్స్​టెన్షన్​కు 78 టీఎంసీలు, గుంటూరు చానెల్​ అదనపు ఆయకట్టుకు 1.3 టీఎంసీలు, శ్రీశైలం రైట్​ బ్రాంచ్​ కెనాల్​ ఎక్స్​టెన్షన్​ కోసం 15 టీఎంసీలు, తుంగభద్ర హైలెవెల్​ కెనాల్​తో 25 టీఎంసీలు, సాగర్​ కుడి కాల్వ ద్వారా గుండ్లకమ్మ, మూసీ, పాలేరులకు 20 టీఎంసీలు, శ్రీశైలం రైట్​ బ్రాంచ్​ కెనాల్​ కింద రెండో పంట కోసం 19 టీఎంసీలు, సిద్ధాపురం లిఫ్ట్​ కింద 2 టీఎంసీలు, వేదవతి లిఫ్ట్​కు 8.29 టీఎంసీల చొప్పున నీళ్లను తీసుకుపోయే ప్రాజెక్టులకు ఏపీ ప్లాన్​ చేస్తున్నదని పేర్కొన్నారు. అవన్నీ బచావత్​ ట్రిబ్యునల్​ అవార్డుకు విరుద్ధంగా చేపడుతున్నవేనని తేల్చి చెప్పారు. బేసిన్​లో ఉన్న రాష్ట్రాల అవసరాలు తీరకుండా.. ఔట్​సైడ్​ బేసిన్​కు తరలిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 43 శాతం వరకు ఔట్​సైడ్​ బేసిన్​కు తరలిస్తున్నదని కృష్ణా ట్రిబ్యునల్​ కూడా గుర్తించిందన్నారు. కాబట్టి, ఏపీ చేపడుతున్న ఆ అక్రమ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డు దృష్టి సారించాలని, వాటిని చేపట్టకుండా ఏపీని నిలువరించాలని ఆయన డిమాండ్​ చేశారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా, విస్తరణలు చేయకుండా ఏపీని అడ్డుకోవాలన్నారు. ఏపీ ప్రాజెక్టుల విషయంపై కేంద్రానికి బోర్డు లేఖ రాయాలని ఆయన తేల్చి చెప్పారు.