తెలంగాణ పారిశ్రామిక భూమార్పిడి విధానాన్ని అమలు చేయడానికి ముందు దానివలన పర్యావరణం మీద పడే ప్రభావం అంచనా, సామాజిక సంక్షేమ స్పృహ అవసరం ఉన్నది. 2025 నవంబర్ 22న తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో పారిశ్రామిక వాడలను బహుళ ప్రయోజన మండలాలుగా మార్చేందుకు హైదరాబాద్ పారిశ్రామిక భూముల పరివర్తన విధానం ( హిల్ట్)ను ప్రారంభిస్తూ జీవో నెం.27ను జారీ చేసింది. నివాస, వాణిజ్య అభివృద్ధి కోసం విలువైన పట్టణ భూములను అందుబాటులోకి తీసుకురావడం సమంజసంగా అనిపించినప్పటికీ, ఈ ఉత్తర్వు ఇచ్చే ముందు ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించలేదు.
సంపూర్ణ విధాన చట్రం లేని ఒక పరిపాలనా ఆదేశంగానే కనిపిస్తోంది. ఇందులో కీలకమైన పర్యావరణ, సామాజిక, ప్రణాళికాబద్ధమైన భద్రతా చర్యలు స్పష్టంగా కొరవడ్డాయి. దీనిమీద రాజకీయ విమర్శలు వచ్చాయి. పర్యావరణవాదులు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. తదుపరి 22 మే 2026న పై ఉత్తర్వులకు జోడుగా విధి విధానాలతో ఒక జీవో విడుదల చేసింది ప్రభుత్వం. పర్యావరణవాదుల విమర్శలు, సూచనలు పట్టించుకోలేదు. భూమిని సొమ్ము చేసుకోవడమే పరమావధిగా ప్రభుత్వం ఈ విధానం అమలు చేయ పూనుకున్నది.
ఈ భూమార్పిడి లక్షిత పారిశ్రామిక ప్రాంతాలకు దశాబ్దాల కాలుష్య చరిత్ర ఉంది. రసాయన వ్యర్థాల విడుదల వల్ల స్థానిక భూగర్భ జలాలు, పారిశ్రామిక వ్యర్థాల వల్ల నేల, గాలి, ఉపరితల నీటి వనరులు కలుషితం కావడం జరుగుతోంది. జీవో నెం.27లో ప్రాథమిక పర్యావరణ అంచనా, కాలుష్య మ్యాపింగ్, నివారణ ప్రణాళికలు లేవు. జీడిమెట్ల, తదితర పారిశ్రామిక ప్రాంతాలలో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. బాధ్యతాయుతమైన భూమి వినియోగ మార్పిడికి, పారిశ్రామిక ప్రాంతాలను నివాసయోగ్య ప్రాంతాలుగా మార్చడానికి సమగ్ర పర్యావరణ తనిఖీలు అవసరం. అదేవిధంగా జోన్ -నిర్దిష్ట పునరుద్ధరణ ప్రణాళికలు, శుద్ధి అనంతర ధృవీకరణ, దీర్ఘకాలిక పర్యవేక్షణ అవసరం. మే నేలలో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులలో ఇవి లేవు. హిల్ట్ విధానం ఇప్పటికే కలుషితమైన భూమిపై నివాస ప్రాంతాలను అనుమతిస్తున్నది. పర్యావరణ దుష్ప్రభావం గురించి అంచనా లేకుండా ఇప్పటికే బహుళ అంతస్తుల నివాస టవర్లను నిర్మించిన పటాన్చెరుతో సహా, అక్రమ మార్పిడులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేరుకే హిల్ట్ ఒక విధానం. ఇందులో విధానానికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవు.
కార్మికుల స్థానభ్రంశం సంక్షోభం
నగరంలో పారిశ్రామికవాడలలో ఫ్యాక్టరీ కార్మికులు, నివాస కాలనీలు, అసంఘటిత వ్యాపారాలు, దశాబ్దాల నాటి సామాజిక మౌలిక సదుపాయాలతో మొత్తం శ్రామిక వర్గ జీవావరణ వ్యవస్థలకు నిలయంగా ఉన్నాయి. పరిశ్రమలు తరలిస్తే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. వీరి విషయంలో హెచ్ఐఎల్టిపి మౌనం స్పష్టంగా కనబడుతోంది. కార్మికులు నష్టపరిహార వ్యవస్థలు లేకుండా స్థానభ్రంశం చెందడం, నైపుణ్యాలను తిరిగి నేర్చుకునే మార్గాలు లేకపోవడం, నివాసానికి సమీప ప్రాంత ఉపాధిని కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మధ్య తరగతి నివాస సముదాయ ప్రాంతాల నుంచి కార్మిక కాలనీలు వెలివేయటం, ఆస్తి విలువలు పెరగడంతో అద్దెల పెరుగుదల, ఉద్యోగాలకు సమీపంలో సరసమైన గృహాలను కోల్పోవడం వంటి సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్నారు. ఈ విధానంలో బలహీన వర్గాలను గుర్తించే సామాజిక-ఆర్థిక సర్వే, స్థానభ్రంశం ప్రభావ అంచనా, నష్టపరిహార చట్రం, పునరాభివృద్ధి చెందిన ప్రాంతాలలో సరసమైన గృహాల కేటాయింపు వంటివి ఏవీ లేవు.
ప్రణాళికా చట్రం లేకపోవడం
హిల్ట్ భూభాగాలను సమగ్ర ప్రాంత ప్రణాళికలో (హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ కావచ్చు, లేదా కోర్ రీజియన్ కావచ్చు) ఏకీకృతం చేయకుండా వాటిని విడివిడి ప్లాట్లుగా పరిగణిస్తుంది. భూములను చుట్టుపక్కల ప్రాంతాలతో అనుసంధానించే స్థానిక ప్రాంత ప్రణాళికలు, మెట్రో, బస్సు నెట్వర్క్లతో రవాణా అనుసంధానం, నీరు/మురుగునీటి పారుదల/ విద్యుత్ సామర్థ్యం కోసం పౌర మౌలిక సదుపాయాల అంచనాలు, పరిశ్రమలలో పనిచేసే కుటుంబాల పిల్లలకు పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల వంటి సామాజిక మౌలిక సదుపాయాల గురించిన ప్రస్తావన ఇందులో లేవు. నిర్దేశిత పారిశ్రామిక పార్కులలో స్థానిక సంస్థల అధికారాలను మంజూరు చేసే శాసన నిబంధనల క్రింద ఐఏఎల్ఏలు స్థాపించడమైనది.
నోటిఫై చేసిన 148 పారిశ్రామిక పార్కులలో 86 పార్కులలో టీఎస్ఐఐసీ ఒక ఐఏఎల్ఏగా పనిచేస్తూ, ఆస్తి పన్ను మదింపు, వసూలు, ప్రకటనల పన్ను, భవన నిర్మాణ అనుమతులు, ఆక్రమణల తొలగింపు, పౌర సేవల నిర్వహణ వంటి అధికారాలను వినియోగిస్తోంది. టీఎస్ఐఐసీ ఆస్తి పన్నులో 35%, ఇతర ఆదాయాలలో 50% సంబంధిత పట్టణ స్థానిక సంస్థలకు చెల్లించాలి. కానీ దీని అమలు అస్థిరంగా ఉంది. చెల్లింపులు తరచుగా అర్ధవార్షికంగా లేదా వార్షికంగా ఆలస్యం అవుతుండటంతో యూఎల్బీ అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. సరైన ఎంఐఎస్ లేకపోవడం పర్యవేక్షణను క్లిష్టతరం చేస్తుంది. టీఎస్ఐఐసీ 86 పారిశ్రామిక పార్కులకు 44 పారిశ్రామిక ప్రాంత సేవా సంఘాలను నోడల్ ఏజెన్సీలుగా నామినేట్ చేసింది. టీఎస్ఐఐసీ కమిషనర్లు కార్యనిర్వాహక అధికారులుగా పనిచేస్తారు. పరిపాలన వ్యవ స్థీకృతంగా కనిపిస్తున్నప్పటికీ పారదర్శకంగా లేదు.
మన ముందున్న పరిష్కారాలు
ప్రస్తుత హిల్ట్ ఒక సమస్యాత్మకమైన పాలనా సరళికి సరిపోతుంది. జీహెచ్ఎంసీ విస్తరణలో విధుల కంటే నియంత్రణకే ప్రాధాన్యతనిస్తూ 27 మునిసిపాలిటీలను విలీనం చేశారు. పట్టణాభివృద్ధి సంస్థ విస్తరణలో స్థానిక సంప్రదింపులు లేకుండా రాష్ట్ర భూభాగంలో 98% భాగాన్ని ఆక్రమించారు. ఈ రెండూ కేంద్రీకృత రూపకల్పనను చూపిస్తున్నప్పటికీ ప్రభావిత జనాభాకు బలహీనమైన రక్షణలు, లోతు, శాస్త్రీయ దృక్పథం కొరవడినట్లు కనిపిస్తున్నాయి. పర్యావరణ అంచనా, సామాజిక-ఆర్థిక రక్షణలు, సమీకృత ప్రణాళిక, ప్రయో జనాల పంపిణీ లేకుండా హెచ్ఐఎల్టిపి (హిల్ట్) ప్రజలను స్థానభ్రంశం చేస్తూ, కాలుష్యాన్ని విస్మరిస్తూ, సంక్షేమం కంటే వ్యక్తిగత లాభాలకే ప్రాధాన్యతనిస్తున్నది. ఇది భూమి విలువను మార్చే మరో ‘పట్టణ పరివర్తన’గా మారే ప్రమాదం ఉంది.
ఎనిమిది ముఖ్యమైన మార్పులు
- పర్యావరణ ప్రభావ అంచనా: ఓఆర్ఆర్ లోని అన్ని పారిశ్రామిక జోన్లలో శాస్త్రీయ కాలుష్య అధ్యయనాలు, నివాస అభివృద్ధికి ముందు జోన్ -నిర్దిష్ట కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలి.
- సామాజిక- ఆర్థిక రక్షణ: 5 కిలోమీటర్ల పరిధిలోని కార్మికులు, నివాసితులను సర్వే చేయడం, నష్టపరిహారం, అందుబాటు ధరలో గృహవసతి, జీవనోపాధి మద్దతుతో సహా ఆయా కుటుంబాల పునరావాస రక్షణ చర్యలను రూపొందించాలి.
- సమీకృత ప్రణాళిక: హైదరాబాద్ మాస్టర్ ప్లాన్లో విలీనం చేసిన స్థానిక ప్రాంత ప్రణాళికల ద్వారా పరివర్తన మండలాలను చుట్టుపక్కల ఉన్న ప్రజా రవాణా సేవలు, వినియోగ సేవలు, పురపాలక సేవలతో అనుసంధానించాలి.
- హరిత ప్రదేశాలు: జోనల్ ప్రణాళికలలో భాగంగా పార్కులు, పట్టణ అడవులు, జలాశయాలు, చెట్ల ఆవరణ కోసం కనీసం 40% స్థలం కేటాయించాలి.
- మౌలిక సదుపాయాల కేటాయింపు: రవాణా మార్గాలు, మురుగునీటి శుద్ధి, వర్షపునీటి నిర్వహణ, పేదల గృహవసతితో సహా ఉమ్మడి మౌలిక సదుపాయాలకు కనీసం 20% కేటాయించాలి.
- కార్మికుల ప్రయోజనాల పంపిణీ : నడుస్తున్న, మూతపడిన పరిశ్రమలలోని కార్మికులు, దశాబ్దాల తరబడి చేసిన కృషికి గుర్తింపుగా, మార్పిడి ప్రోత్సాహకాలు, లాభాలలో గణనీయమైన వాటాను అందించాలి. కొత్త పారిశ్రామిక
- మండలాల్లోని కార్మికులకు గృహ వసతి కల్పించడం ప్రధానంగా ఆలోచించాలి.
- పునరావాస వ్యూహం: కాలుష్య నియంత్రణలు ఉన్న జోన్లను గుర్తించడం, ఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం అందించి, కార్మికుల జీవనోపాధికి భద్రత కల్పించాలి.
- పరిశ్రమల స్థాపనకు నిబంధనలు: ఆహార భద్రతను పరిరక్షించడానికి, తప్పనిసరి కాలుష్య నివారణ, నిపుణుల సూచనలు, ప్రజాభిప్రాయ సేకరణ, ప్రధాన వ్యవసాయ భూమిని స్పష్టంగా మినహాయించడంతో కూడిన శాస్త్రీయంగా
- నిబంధనలు రూపొందించాలి.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
