
సికింద్రాబాద్, వెలుగు: సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ మంగళవారం నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాంగోపాల్ పేట్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం, పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామ్గోపాల్పేట్లో ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టి పసుపు కుంకుమ అందించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి ముఖ్యఅతిథిగా హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. డాక్టర్ కోట నీలిమా విజయం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. మహిళల అభివృద్ధి సాధ్యం కావాలంటే కోట నీలిమను భారీ మెజార్టీ తో గెలిపించాలన్నారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్, సీనియర్ నాయకులు శీలం ప్రభాకర్,ఉష, సురేశ్, సోహెల్, నూర్,తదితరులు పాల్గొన్నారు.