మే 24లోగా వడ్ల కొనుగోళ్లు కంప్లీట్​ కావాలి : డాక్టర్​ శరత్

మే 24లోగా వడ్ల కొనుగోళ్లు కంప్లీట్​ కావాలి : డాక్టర్​ శరత్

కామారెడ్డి టౌ న్​, వెలుగు: జిల్లాలో వడ్ల కొనుగోళ్లు ఈ నెల 24వ తేదీలోగా కంప్లీట్​ చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్​ శరత్, కామారెడ్డి జిల్లా ఆఫీసర్లకు సూచించారు.  సోమవారం ఆయన జిల్లా కలెక్టర్​ జితేశ్​ వి. పాటిల్​, అడిషనల్​ కలెక్టర్​ చంద్ర మోహన్​ ఇతర అధికారులతో టెలి కాన్ఫరెన్స్​ నిర్వహించారు.  ప్రత్యేక అధికారి మాట్లాడుతూ.. కొనుగోళ్ల ప్రక్రియను  మరింత స్పీడప్​ చేయాలని సూచించారు.  

ఇప్పటికే కొనుగోళ్లు కంప్లీట్​అయిన సెంటర్లలో  ఉన్న సిబ్బందిని, హమాలీలను , కాంటాలను, కంప్లీట్​ కాని సెంటర్లకు తరలించాలన్నారు. రోజుకు  పది వేల మెట్రిక్​ టన్నుల వడ్లు తరలించేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండల స్థాయి అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. సరిపడా లారీలను సమకూర్చుకోవాలని  సూచించారు. కలెక్టర్​  జితేష్​ వి. పాటిల్​ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే రెండు లక్షల 64వేల మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేశామన్నారు. ఇంకా 120సెంటర్లలో కొనుగోళ్లను శుక్రవారం నాటికి పూర్తి చేస్తామన్నారు.

మాస్​ కాఫీయింగ్​కు అనుమతించవద్దు

ఇంటర్మీడియట్​ సప్లమెంటరీ​ పరీక్షల్లో ఎలాంటి కాఫీయింగ్​కు , మాల్​ ప్రాక్టీస్​అనుమతించొద్దని  కలెక్టర్​ జితేశ్ వి. పాటిల్​ ఆఫీసర్లకు సూచించారు.  సోమవారం కలెక్టరేట్​లో సూపరింటెండెంట్లు, డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ..  ఎగ్జామ్స్​ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలు సాఫీగా, పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు.  విధుల్లో  నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  నోడల్​ అధికారి షేక్​ సలాం, ఆఫీసర్లు శ్రీనాథ్​, నాగేశ్వరయ్య పాల్గొన్నారు.