నిజామాబాద్, వెలుగు: తాగి పడేసిన బీడీ అగ్ని ప్రమాదానికి కారణమైంది. నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్ ఆరో అంతస్తులో శుక్రవారం ఉదయం మంటలు లేచాయి. ఈ ఘటనతో ఆసుపత్రిలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. విషయం గమనించిన డాక్టర్లు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని కారణాలను పరిశీలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శానిటేషన్ సిబ్బంది గ్రౌండ్ ఫ్లోర్లో వేస్ట్ మెటీరియల్ను ఒక మూలలో పోశారు.
ఈ సమయంలో రోగి బంధువుల్లో ఎవరో బీడీ కాల్చి అక్కడే పడేయడంతో కాగితాలకు మంటలు అంటుకుని ప్లాస్టిక్ బాటిళ్లకు వ్యాపించాయి. అక్కడి నుంచి మంటలు పక్కనే ఉన్న స్మోక్ పైప్ను తాకడంతో పొగ వేగంగా పైకి వెళ్లి 6వ అంతస్తుకు చేరింది. ఖరీదైన వైద్య పరికరాలు, మందులు ఉన్న ఆ ఫ్లోర్లోకి పొగమంటలు రావడంతో డాక్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో ఉన్న ఇన్పేషెంట్లు కూడా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.
