సింగరేణి కార్మికులకు సొంత ఇళ్లు ఇవ్వాలి: కవిత

సింగరేణి కార్మికులకు సొంత ఇళ్లు ఇవ్వాలి: కవిత

 సింగరేణి కార్మికులకు సొంత ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన 'సేవ్ సింగరేణి' రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెడికల్ టెస్ట్ పూర్తయిన 300 మందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలన్నారు. సింగరేణిని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. డిపెండెంట్ కార్మికుల నియామకాలపై విచారణ జరిపిస్తామన్న ప్రభుత్వ తీరుపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని అనడం విడ్డూరంగా ఉందని.. చేతనైతే మీ ప్రభుత్వ అవినీతిపై విచారణకు సిద్ధమా? అంటూ ఆమె సవాల్ విసిరారు.

ప్రకృతి మనకు బొగ్గును వరంగా ఇచ్చిందని.. ఆ సహజ వనరులు ప్రజల మేలు కోసమే వాడాలని కవిత హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి ఏ విధంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొందో.. నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ అదే పరిస్థితులు పునరావృతమవుతున్నాయని ఆమె ఆరోపించారు. సింగరేణి హక్కుల కోసం, కార్మికుల భవిష్యత్తు కోసం మరో పోరాటం తప్పదని.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని కవిత స్పష్టం చేశారు


+