- అనారోగ్యంతో భువనగిరి మాజీ ఎమ్మెల్యే నర్సింహ్మారెడ్డి కన్నుమూత
- 300 ఎకరాల భూమి పేదలకు పంచిన నేత
- తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
- గోదావరి–మూసీ లింక్ కోసం పోరాటం,
- బీబీనగర్లో ‘నిమ్స్’ కోసం నిరాహార దీక్ష
- సొంతిల్లు లేదు.. స్కూటర్పైనే ప్రయాణం
- బ్రహ్మణపల్లిలో నేడు అంత్యక్రియలు, సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్
యాదాద్రి, వెలుగు: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి (82) కన్ను మూశారు. నిమ్స్లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం తెల్లవారుజామన 2 గంటలకు మృతిచెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. యాదాద్రి జిల్లా, బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో 1942 మార్చి 10న నర్సింహారెడ్డి జన్మించారు. కొమ్మిడి నర్సింహారెడ్డి, సుకన్యమ్మ దంపతులకు రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రజిని, రాధిక సంతానం. సొంతూరు బ్రాహ్మణపల్లికి 1962 నుంచి 1970 వరకు సర్పంచ్గా ఉన్నారు.
1969 తొలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. భువనగిరి తాలూకా సమితి ప్రెసిడెంట్గా రెండుసార్లు బాధ్యతలు నిర్వహించారు. 1978 ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన నర్సింహారెడ్డి, జనతా పార్టీ తరఫున పోటీ చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీపై గెలిచారు. 1983లో ఎన్టీర్, తెలుగుదేశం ప్రభంజనంలోనూ కాంగ్రెస్ నుంచి ఆయన రెండోసారి గెలిచారు. అప్పటి నుంచి ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన నర్సింహారెడ్డి పార్థివదేహాన్ని ప్రజల సందర్శన కోసం రామంతాపూర్లోని కూతురు రజిని ఇంట్లో ఉంచారు. సొంతూరు బ్రహ్మణపల్లిలో బుధవారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.
భువనగిరి, ఆలేరుకు సాగునీటి కోసం..
గోదావరి జలాలతో భువనగిరి, ఆలేరు ప్రాంతాలకు సాగునీరు అందించాలని ఆయన ఉద్యమించారు. గోదావరి జలాలను మూసీలోకి మళ్లించడం ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు అందించ వచ్చని ఆయన బ్లూ ప్రింట్ రూపొందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బీబీనగర్లో నిమ్స్ ప్రారంభించాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి- విస్తరణలో ఇండ్లు, భూములు కోల్పోయి నిర్వాసితులైన ప్రజలకు పరిహారం ఇవ్వాలని ఆందోళన నిర్వహించారు.
నిరాడంబర జీవితం..
23 ఏండ్లుగా ప్రజా ప్రతినిధిగా కొనసాగిన ఆయన ఎలాంటి ఆస్తులు సంపాదించుకోకుండా తండ్రి నిర్మించిన ఇంట్లోనే జీవనం కొనసాగించాడు. సొంత గ్రామంలో 300 ఎకరాలు పేదలకు దానం చేశారు. నిరాడంబరంగా జీవించిన ఆయన స్కూటర్పై తిరిగేవారు. చివరకు సొంతిల్లు కూడా లేదు. కొన్నాళ్లు అద్దె ఇంట్లో నివసించిన ఆయన చివరకు రామంతపూర్లో పెద్ద కూతురు రజిని ఇంట్లో చివరి రోజులను గడిపారు.
సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
నర్సింహా రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నర్సింహారెడ్డి తుదిశ్వాస విడిచే వరకు నీతినిజాయితీతో జీవించారని కొనియాడారు. నిత్యం ప్రజల పక్షాన నిలిచి ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కొమ్మిడి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
