- ఇండియా ఎగ్జిక్యూటివ్స్కు డిమాండ్
- రూ.19 కోట్ల వరకు ప్యాకేజీ
- కంపెనీల కీలక విభాగాలు ఇండియాకు తరలింపు
న్యూఢిల్లీ: మల్టీ నేషనల్ కంపెనీలు (ఎంఎన్సీలు) దేశీయంగా వ్యాపార కార్యకలాపాలను విస్తరించడమేగాక, పెద్ద పోస్టుల్లోనూ మనవాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రొడక్ట్ డెవెలప్మెంట్, ఏఐ, ఇంజనీరింగ్, సంస్థాగత నిర్ణయాల విభాగాలను ఇండియాకు తరలిస్తున్నాయి. ఇక్కడి నుంచి పనిచేసే ఎగ్జిక్యూటివ్స్కు అంతర్జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగిస్తున్నాయి. భారతదేశానికి అంతర్జాతీయంగా ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యత, ఇక్కడి లోతైన నాయకత్వ నైపుణ్యాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) హబ్లుగా మారడం ఈ ట్రెండ్కు ప్రధాన కారణాలు. ఇటీవల ఇలాంటి నియామకాలు భారీగా పెరిగాయని రిక్రూట్మెంట్ఏజెన్సీలు చెబుతున్నాయి. అత్యున్నత స్థాయి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ప్యాకేజీలు రూ.4.5 కోట్ల నుంచి రూ.15-–19 కోట్ల వరకు ఉంటున్నాయి.
వీళ్లు గ్లోబల్, ప్రాంతీయ , స్థానిక ఆఫీసుల బాధ్యతలు చూస్తున్నారు. ఇండస్ట్రియల్స్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎమ్ఎస్), గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారతీయ ఎగ్జిక్యూటివ్స్ హవా నడుస్తోంది. సీఈఓ పదవులు మాత్రమే కాకుండా, కంపెనీ పరిమాణాన్ని బట్టి సీ1 ,సీసీ-2 స్థాయిల్లోని ఫంక్షనల్ లీడర్షిప్ స్థానాలను కూడా చేపడుతున్నారు. ఎంఎన్సీలు తమ ఏఐ సామర్థ్యాలను, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రోగ్రామ్లను విస్తరిస్తున్నందున టెక్నాలజీ రంగానికి డిమాండ్ ఏర్పడింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్యూమర్, హెల్త్కేర్ విభాగాల్లోనూ ఈ వేగం కనిపిస్తోంది. భారత్, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వ్యాపారాలను విస్తరించిన అనుభవం ఉన్న లీడర్లను గ్లోబల్ టీమ్లను నడపడానికి గ్లోబల్ కంపెనీలు ఎంచుకుంటున్నాయి.
ఈ విభాగాలకు ఇండియన్లే సారథులు
గ్లోబల్ ప్రొడక్ట్స్, ప్లాట్ఫారమ్లు, ఈ–కామర్స్, సప్లై చైన్ వంటి విభాగాల బాధ్యతలను ఎక్కువగా భారతీయ నిపుణులకు అప్పగిస్తున్నారు. రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ యాక్సెస్ ఇటీవల ఒక పెద్ద సంస్థ కోసం రూ.ఏడు కోట్ల ప్యాకేజీతో గ్లోబల్ సీహెచ్ఆర్ఓ నియామకాన్ని పూర్తి చేసింది. ఆయన ఈ ఉద్యోగం కోసం భారతదేశానికి తిరిగి వచ్చారు. గత మూడేళ్లతో పోలిస్తే ఇలాంటి గ్లోబల్ అవకాశాలు 3–4 రెట్లు పెరిగాయని ఆ సంస్థ పేర్కొంది.
డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ఫైనాన్స్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ విభాగాల్లో లీడర్లకు డిమాండ్ ఉందని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా తెలిపింది. జేపీ మోర్గన్ చేజ్ వంటి పెద్ద కంపెనీలు కూడా మనదేశంలోని ఎగ్జిక్యూటివ్స్కు సీనియర్ లీడర్షిప్ బాధ్యతలను ఇస్తున్నాయి. టెక్నాలజీ, ప్రొడక్ట్ లీడర్షిప్ విభాగాల్లో సీటీఓ, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, సైబర్ సెక్యూరిటీ హెడ్స్, ఇంజనీరింగ్ లీడర్స్ వంటి జాబ్స్కు ఇండియన్లను నియమించుకోవడం పెరుగుతోంది.
