11 ఏండ్ల తర్వాత సింగరేణికి కొత్త గని

11 ఏండ్ల తర్వాత సింగరేణికి కొత్త గని
  •     ఫలించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల కృషి
  •     బొగ్గు బ్లాక్​ల విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ ​డబుల్ ​గేమ్​ 
  •     కాంగ్రెస్​ వచ్చాకే కదలిక
  •     తాడిచర్ల -2బ్లాక్​లో 182 మిలియన్​ టన్నుల బొగ్గు నిక్షేపాలు 

 కోల్​బెల్ట్/భూపాలపల్లి, వెలుగు: సింగరేణి భవిష్యత్తుపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్​ను కేంద్రం నేరుగా సింగరేణికి కేటాయించడంపై  హర్షం వ్యక్తమవుతున్నది. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్​లో 182 మిలియన్​టన్నుల బొగ్గు నిక్షేపాలుండగా.. సుమారు 30 నుంచి 40 ఏండ్ల వరకు బొగ్గును వెలికితీసే ఛాన్స్​ ఉంది. కొత్త గనితో బొగ్గుఉత్పత్తితో పాటు సుమారు 2 వేల మందికి ఉపాధి అందుతుంది. భూపాలపల్లి జిల్లా మల్హర్​ మండలంలోని తాడిచర్ల, పెద్దతూండ్లు, శాత్రజ్​పెల్లి అటవీ ప్రాంతాల్లో సుమారు 18.750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తాడిచర్ల 2 కోల్​బ్లాక్​ ఉంది.  

6.08 చదరపు కిలోమీటర్ల పరిధిలో 182 మిలియన్​ టన్నుల నిక్షేపాలున్నాయని గుర్తించారు. ఈ బ్లాక్​ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1,1ఏ గనులు, తాడిచర్ల-1 గని మధ్యలో ఉండడంతో బొగ్గు రవాణాకు అనుకూలంగా ఉంది. తాడిచర్ల-2 గనిని 2013లో సింగరేణికి కేటాయించినా అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తికి అనుమతులు తీసుకోలేదు. దీంతో సింగరేణి తీవ్రంగా నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వం 2015లో ఒడిశాలోని నైనీ కోల్​బ్లాక్​ను సింగరేణికి కేటాయించగా.. వివిధ కారణాలతో 2025 ఏప్రిల్​ 17న గనిని ప్రారంభించింది. నైనీ బ్లాక్​ కేటాయించినప్పుడే అదే ప్రాంతంలోని న్యూపాత్రపాద గనిని సైతం కేటాయించినా సింగరేణి తీసుకోలేదు. 2015 తర్వాత సింగరేణికి మరే కొత్త గని దక్కలేదు. 

బీఆర్ఎస్ డబుల్​ గేమ్ 

మైన్స్​ అండ్​ మినరల్స్​ సవరణ చట్టం-2015 ప్రకారం.. దేశంలోని బొగ్గు బ్లాకులన్నింటినీ వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయిసున్నది. కానీ వేలంలో సింగరేణి పాల్గొనకుండా గత బీఆర్ఎస్​సర్కార్​అడ్డుకోవడంతో పదేండ్లు సింగరేణికి ఒక్క బొగ్గు బ్లాక్​ కూడా దక్కలేదు. బీఆర్ఎస్​అధికారంలోకి వచ్చిన తర్వాత 80 మిలియన్​ టన్నుల నిక్షేపాలున్న అతిపెద్ద గని తాడిచర్ల 1 ని ఏఎంఆర్​ అనే ఆంధ్రా కంపెనీకి 30 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చింది. అంతేకాకుండా, 2015లో మినరల్​ అండ్​ మైన్స్​ చట్ట సవరణకు ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెడితే బీఆర్ఎస్ ఎంపీలు​మద్దతిచ్చారు. 

కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో సింగరేణిలో బీఆర్ఎష్ అనుబంధ కార్మికసంఘం నామమాత్రంగా ఆందోళన చేపట్టింది. ​రాష్ట్రంలో కళ్యాణిఖని6, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి ఓసీపీలకు కేంద్రం వేలం నిర్వహిస్తే సింగరేణి అందులో పాల్గొనకుండా బీఆర్ఎస్​ అడ్డుకుంది. గనులను సింగరేణికే కేటాయించాలని కార్మిక సంఘాలు సమ్మె చేయడంతో నాటి సీఎం కేసీఆర్​ ప్రధానికి మొక్కుబడిగా లేఖ రాసి వదిలేశారు. 

మంత్రి వివేక్​ చొరవతో కేంద్రంపై సీఎం ఒత్తిడి 

బొగ్గు గనులను నేరుగా సింగరేణికే కేటాయించాలన్న డిమాండ్​ను కేంద్రం అంగీకరించకపోవడంతో వేలంలో సింగరేణి పాల్గొనేలా అనుమతించాలని మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో పాటు పలువురు ఎంపీలు,ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి వివేక్​, ఎంపీ వంశీకృష్ణ పలుమార్లు ప్రధాని నరేంద్రమోదీ, బొగ్గు మంత్రిత్వశాఖ మంత్రిని కలిసి నేరుగా బొగ్గు బ్లాక్​లు సింగరేణికి కేటాయించాలని కోరారు. దాంతో పాటు బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్​ఇచ్చింది. 

దీంతో సింగరేణి తాజాగా చత్తీస్​​గఢ్​లోని 'తార', తెలంగాణలోని మణుగూరు ఓసీ-2 డిప్​సైడ్​ ఎక్స్​టెన్షన్​ మైన్​లకోసం టెండర్లు వేసింది. బీజేపీ కూడా ఈ మధ్య సింగరేణి ప్రాంతం మీద దృష్టి సారించింది. ఆ పార్టీ లోకల్ లీడర్లు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డిని కలిసి బొగ్గు బ్లాకులు నేరుగా సింగరేణికి కేటాయించాలని కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజులు కింద సింగరేణి భవన్​లో కేంద్రమంత్రి సింగరేణి యాజమాన్యంతో చేసిన సమీక్షలో రెండు గనులను నేరుగా కేటాయించే చాన్స్​ ఉందని ప్రకటించారు. ఆమేరకు తాజాగా తాడిచర్ల బ్లాక్​2ను సింగ రేణికి కేటాయించినట్లు కిషన్​ రెడ్డి చేసిన ప్రకటనతో కోల్​బెల్ట్​వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది.