హైదరాబాద్, వెలుగు: పోలీసుశాఖలో నియామకాలు, ఖాళీల భర్తీకి సంబంధించిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఖాళీలు, జారీ చేసిన నోటిఫికేషన్లల్లో భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు అందజేయాలంది. పోలీసు శాఖలో వివిధ కేడర్లలో మంజూరైన పోస్టులను భర్తీ చేయడం లేదంటూ హెల్ప్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది.
పిటిషనర్ న్యాయవాది వాదిస్తూ పోలీసు శాఖలో మంజూరైన పోస్టులను భర్తీ చేయడం లేదని, ఏటా క్రమం తప్పకుండా ఖాళీల భర్తీకి వీలుగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తిరిగి వాదనలు వినిపిస్తూ ఏడు వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిందని పేర్కొన్నారు. పోలీసు శాఖలో అన్ని విభాగాల్లోని ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వాదనల తర్వాత ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
