పేదలు ఎక్కువ మంది పిల్లలను కంటే పేదరికం పెరుగుతుందా?.. అష్నీర్ గ్రోవర్ భార్యపై నెటిజన్స్ ఫైర్

పేదలు ఎక్కువ మంది పిల్లలను కంటే పేదరికం పెరుగుతుందా?.. అష్నీర్ గ్రోవర్ భార్యపై నెటిజన్స్ ఫైర్

వ్యాపారవేత్త, భారత్‌పే మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. రియాలిటీ షో Lock Upp 2లో పాల్గొంటున్న మాధురీ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని పంచుకుంటూ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఫ్యామిలీ, వెల్త్, పిల్లల సంఖ్య వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆర్థిక అసమానతలు, పేదరికం, సామాజిక బాధ్యతపై కొత్త చర్చకు కారణమయ్యాయి.

మూడో బిడ్డపై మాధురీ వ్యాఖ్యలు వైరల్..
షోలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మాధురీ తన జీవితంలోని ఓ విషయాన్ని వెల్లడించింది. తాను అష్నీర్ గ్రోవర్ ఒకప్పుడు మూడో సంతానం గురించి ఆలోచించామని, కానీ కుటుంబ పరిస్థితులు, సరైన సమయం లేకపోవడంతో ఆ ఆలోచనను కొనసాగించలేకపోయామని చెప్పింది. అయితే ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలే వివాదానికి కేంద్రంగా మారాయి. “మూడో బిడ్డ ఉంటే మనిషి యవ్వనంగా ఉంటారు. మీరు సంపన్నులను చూస్తే, షారుఖ్ ఖాన్ వంటి చాలా మందికి మూడో సంతానం ఉంది. ‘హమ్ దో హమారే దో’ అనే ఆలోచన అందరికీ వర్తించదు. ధనవంతులు ఎక్కువ మంది పిల్లలను కంటే సంపద పెరుగుతుంది.. పేదలు ఎక్కువ మంది పిల్లలను కంటే పేదరికం పెరుగుతుంది” అనే భావనతో మాధురీ కామెంట్స్ చేయటం వివాదంగా మారింది. దీంతో పేదలు పిల్లలను కనకూడదా అది దేశానికి నష్టమా అనే చర్చ ఊపందుకుంది.

సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత..
మాధురీ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆమె మాటల్లో ఫైనాన్షియల్ రియాలిటీ ఉందని సమర్థించగా, మరికొందరు వాటిని వర్గ వివక్షతో కూడిన వ్యాఖ్యలుగా విమర్శించారు.

►ALSO READ | 14 ఏళ్ల కుర్రాడి సూపర్ ఆలోచన.. బెంగళూరు ఫుట్‌పాత్‌లను కాపాడేందుకు ‘Raste’ యాప్!

కొంతమంది నెటిజన్లు దేశంలో పేదరికానికి కారణం పేద కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనడం మాత్రమే కాదని, ఆదాయ అసమానతలు, అవకాశాల కొరత, వనరుల పంపిణీ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. మరికొందరు ఆమె వ్యాఖ్యలు “ఎలైట్ ఆలోచనా విధానాన్ని” ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు.

అష్నీర్ గ్రోవర్‌కు దానం చేయాలంటూ డిమాండ్లు..
ఈ వివాదం మధ్య ఓ సోషల్ మీడియా యూజర్ అష్నీర్ గ్రోవర్‌ను ట్యాగ్ చేస్తూ మరో ప్రశ్న లేవనెత్తారు. ఆయనకు ఉన్న సుమారు రూ.900 కోట్ల సంపదను పేద కుటుంబాలకు పంచితే పేదరికం తగ్గుతుందని సూచించారు సదరు యూజర్.

గ్రోవర్ ఫ్యామిలీ తమ రూ.900 కోట్ల సంపదను ఇద్దరు పిల్లల కోసం ఉంచుకోవటం కంటే.. దానిని సుమారు 1,800 కుటుంబాలకు పంచి ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు ఇస్తే, పిల్లలను మెరుగైన పరిస్థితుల్లో పెంచుకునే అవకాశం ఆ ఫ్యామిలీలకు దక్కుతుందని యూజర్ సూచించారు. అంతేకాకుండా సంపన్నులు తమ సంపదను పంచుకోవాలని, అలా చేస్తే పేదరిక సమస్య పరిష్కారమవుతుందని వ్యాఖ్యానించారు.

గ్రోవర్ కౌంటర్..
ఈ విమర్శలకు అష్నీర్ గ్రోవర్ స్పందించారు. తన భార్య ఇప్పటికే తన అభిప్రాయాన్ని పంచుకున్నారని.. దానిపై వచ్చిన విమర్శల విషయంలో మరింత చెప్పడానికి ఏమీలేదన్న విధంగా ఆయన సమాధానం ఇచ్చారు. చందాలు, దానం అడగటం చాలా ఈజీ అని.. తన భార్య చెప్పాలనుకున్నది ఇప్పటికే చెప్పేసిందంటూ, ఇక డబ్బులు గిబ్బులు దొరకవ్ అని రిప్లై ఇచ్చారు అష్నీష్ గ్రోవర్ ఎక్స్ ఖాతాలో. 

మెుత్తానికి మాధురీ కామెంట్స్ తర్వాత.. పిల్లలను కనడంలో ఆర్థిక సామర్థ్యం కీలకమని కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు పేదరికాన్ని కేవలం పిల్లల సంఖ్యతో ముడిపెట్టడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. మాధురీ జైన్ వ్యాఖ్యలు ఇప్పుడు కుటుంబ నిర్ణయాల నుంచి సామాజిక ఆర్థిక విధానాల వరకు విస్తరించిన పెద్ద చర్చకు కారణమయ్యాయి.