భారీ వర్షాలు, వరదలతో వయనాడ్ అల్లకల్లోలం.. విరిగిపడి జనం మీదకు కొండచరియలు

భారీ వర్షాలు, వరదలతో వయనాడ్ అల్లకల్లోలం.. విరిగిపడి జనం మీదకు కొండచరియలు

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు మరోసారి అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా.. వయనాడ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. వయనాడ్‌లోని కల్లాడిలో మీనాక్షి వంతెన దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. వయనాడ్-కల్లాడి సొరంగం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది. సొరంగం కోసం తీసిన మట్టి కుంగిపోయింది. ఒక ఇల్లు, ఒక చర్చి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతంలోని బస్ స్టాప్, వంతెన భూమిలో కూరుకుపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలిసింది.

ఈ ప్రాంతంలో పూరి గుడిసెలో గడుపుతున్న ఒక కుటుంబం కూడా భూగర్భంలో చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆరుగురు కార్మికులను మెప్పాడి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించిన వారందరూ వలస కార్మికులే కావడం గమనార్హం. వంతెన సమీపంలోని కొండచరియ కూలి నిర్మాణ ప్రదేశంలోకి పడిపోయింది. ప్రమాద స్థలంలో మరికొంత మంది చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. కార్మికులను తీసుకువెళ్తున్న రెండు బస్సులు కూడా భూమి కింద కూరుకుపోయాయి.

వయనాడ్, కోజికోడ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కన్నూర్, కాసరగోడ్, మలప్పురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పాలక్కాడ్, త్రిస్సూర్, ఇడుక్కి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా వయనాడ్ లోని కల్లాడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతంలో మట్టిని తొలగిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వయనాడ్లోని కల్లాడి ప్రాంతంలో 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.