నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. పారాణి ఆరకముందే.. పెళ్లయి నెల రోజులు కూడా కాకముందే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల రోదనతో, గ్రామస్తుల ఆవేదనతో ఆ ఊర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఆలూర్ మండలం కల్లేడి గ్రామంలో 2026 ఏప్రిల్ 5న జరిగింది ఈ ఘటన. బాన్సువాడకు చెందిన అఖిలకు మార్చి 5న శ్రీకాంత్తో వివాహం జరిగింది. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక శుక్రవారం (ఏప్రిల్ 3) బాన్సువాడ నుంచి అత్తగారింటికి అఖిలను పంపించారు తల్లిదండ్రులు. బిడ్డకు మంచి చెడ్డ చెప్పి భద్రంగా ఉండాలని వెళ్లిన తల్లిదండ్రులు రెండు రోజుల్లోనే విషాద వార్త వినాల్సి వచ్చింది.
ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అఖిల. భర్త శ్రీకాంత్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో సూసైడ్ చేసుకుంది. గ్రామస్తుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
