భద్రాచలం,వెలుగు: భద్రాచలం వద్ద గోదావరిలో నేరుగా డ్రైన్వాటర్ కలుపుతున్నారు. వరదలు రావడంతో కరకట్ట కింద ఉన్న స్లూయిజ్ లను మూసివేశారు. దీంతో డ్రైన్వాటర్ అంతా రామాలయం పరిసరాలను ముంచెత్తింది. వీటిని 16 మోటార్లతో పంపింగ్ చేసి గోదావరిలో కలిపారు. దీంతో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) పెరిగి జలాలు కలుషితం అయ్యాయని అంటున్నారు. భద్రాచలం వద్ద బీవోడీ 5శాతం కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం.
ఎస్టీపీల ఏర్పాటు ఎన్నడు.?
గోదావరి జలాల కాలుష్య నివారణ పథకం మూలకు పడడంతో ఇప్పుడు సీవెర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు విషయం తెరపైకి వచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భద్రాచలం గోదావరి కరకట్టల కింద మూడు చోట్ల ఎస్టీపీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించింది. రాష్ట్రంలోని అన్ని సిటీలలో ఈ విధానం ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. ఇప్పుడు భద్రాచలంలో మూడు ఎస్టీపీలు కరకట్ట కింద ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. గోదావరి జలాలు కలుషితం కాకుండా సీవెర్ ట్రీట్మెంట్
ప్లాంట్ల ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని మురికి నీరంతా నేరుగా గోదావరిలో కలిపేస్తున్నారు. వరదల సమయంలో స్లూయిజ్లు మూసివేయడంతో డ్రైన్ వాటరంతా పట్టణాన్ని ముంచేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ముప్పు తప్పదని స్థానికులు అంటున్నారు. ఫ్లడ్ లెవల్స్ ప్రకారం స్లూయిజ్ల ఎత్తు కూడా పెంచాల్సిన అవసరం ఉంది.
పథకం మూలకు.. మురుగునీరు గోదావరికి
గోదావరి జలాల కాలుష్య నివారణ పథకాన్ని 2004లో ప్రారంభించారు. గోదావరి కరకట్టలు నిర్మించాక పట్టణంలోని డ్రైన్వాటర్ను గోదావరిలో నేరుగా కలుస్తుండడంతో 1995–-96లో గోదావరి పరివాహక ప్రాంతంలోని మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, రాజమండ్రిలలో రూ.34.19 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేశారు. భద్రాచలంలో రూ.3.10 కోట్లతో ఎస్టీపీని నిర్మించారు. కానీ 2004లో ప్రారంభించిన ఈ స్కీమ్ ఒక్క ఏడాది మాత్రమే పని చేసి మూలకు పడింది. మోటార్ల కెపాసిటీ సరిగా లేకపోవడం, డ్రైన్వాటర్ను మనుబోతుల చెరువు వద్దకు తరలించే పరిస్థితి లేకపోవడంతో ఈ స్కీం మూలకుపడింది. రూ.6 లక్షల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోవడం కూడా ఒక కారణం. పికప్గ్రిట్చాంబర్ డైవర్షన్ ఏర్పాటు చేసి సంప్ కమ్ పంపు హౌస్ ద్వారా మురుగునీటిని మోటార్ల ద్వారా తోడి మనుబోతుల చెరువుకు తీసుకెళ్లి అక్కడ శుద్ది చేసి జలాలను వ్యవసాయానికి, మిగిలిన వ్యర్థాలను ఎరువులుగా మార్చడం ఈ స్కీం ఉద్దేశం. ఇందుకు 50హెచ్పీ మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా తక్కువ కెపాసిటీ ఉన్న మోటార్లు బిగించడంతో ఆగిపోయింది. ద్రవరూపంలో 70 మిలియన్ లీటర్లు, ఘనపదార్ధాల రూపంలో 25 టన్నుల కాలుష్యం నిత్యం భద్రాచలం స్నానఘట్టాల వద్ద గోదావరిలో కలుస్తోంది. నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ నిబంధనకు ఇది విరుద్ధం. అయినప్పటికీ మురికినీటిని శుద్ధి చేయకుండా గోదావరిలో నేరుగా
కలుపుతున్నారు.
కాలుష్యాన్ని తగ్గించవచ్చు
సీవేర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుతో మురుగునీటిని శుద్ధి చేయడం సాధ్యమవుతుంది. అన్ని చోట్ల ఇలా హైపవర్ మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. కరకట్టలు పొడిగిస్తున్న నేపథ్యంలో ఈ విధానం ద్వారా గోదావరి కాలుష్యాన్ని కొంత మేరకు తగ్గించవచ్చు. - రాంప్రసాద్, ఈఈ, ఇరిగేషన్
సమస్యకు పరిష్కారం చూపాలి
భద్రాచలంలో డ్రైన్ వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. వర్షం వస్తే కరకట్ట స్లూయిజ్ల ద్వారా గోదావరిలో డ్రైనేజీ వాటర్ కలిపేస్తున్నారు. వరదలు వస్తే స్లూయిజ్ లు మూయడంతో ఆ నీరంతా సుభాష్నగర్, చప్టా దిగువ, అశోక్నగర్ కొత్తకాలనీ,అయ్యప్పకాలనీలను ముంచెత్తుతోంది. దుర్వాసన భరించలేక పోతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. - తిరుమలరావు, న్యాయవాది, సామాజిక కార్యకర్త