
హైదరాబాద్ సిటీ, వెలుగు: అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద కాలువల్లో రోబోటిక్ టెక్నాలజీతో పూడికతీత పనులను హైడ్రా, జీహెచ్ఎంసీలు చేపట్టాయి. ఈ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు.
మెట్రో స్టేషన్ కింద ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ లైన్లు కొన్ని పూర్తిగా బ్లాక్ అయినట్లు హైడ్రా గుర్తించింది. ఇక్కడ రోబోటిక్ సాయంతో పూర్తిగా పూడికను తొలగించేందుకు వీలుందని గుర్తించి పనులు చేస్తున్నారు.
కాలువల్లో పేరుకుపోయిన పూడికను హైడ్రా, జీహెచ్ ఎంసీలు కలిసి ఇప్పటికే తొలగించాయి. ప్రధాన రహదారి కింద ఉన్న బాక్సు డ్రెయిన్లలో పూడికను తొలగించడానికి రోబో టెక్నాలజీని వాడుతున్నారు. రంగనాథ్ మాట్లాడుతూ...రోబో టెక్నాలజీతో గట్టిగా మారిన పూడికను సొరంగ మార్గాల్లో మట్టిలా తీసేయవచ్చాయన్నారు.
ప్రధాన రహదారి కింద ఉన్న బాక్సు డ్రెయిన్లలో ఉన్న పూడిక మొత్తం తీస్తే చాలావరకు వరద సమస్యను పరిష్కరించవచ్చన్నారు. రోబో టెక్నాలజీతో నాలుగైదు రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని చెప్పారు.