- రాష్ట్ర సర్కార్కు బాలరాజు యాదవ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: గొర్ల పంపిణీ స్కీమ్పై రాష్ట్ర సర్కార్ స్పష్టతనివ్వాలని షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. లక్షల మంది గొల్లకురుమలు అప్పులు చేసి డీడీలు కట్టారని, ఇప్పటి వరకు ప్రభుత్వం గొర్రెలు ఇవ్వకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గొర్లు ఇస్తారో.. వడ్డీతో కలిపి వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
డబ్బుల వాపస్ కావాలని దరఖాస్తు చేసుకున్న గొల్లకురుమలకు వెంటనే డబ్బులు విడుదల చేయాలన్నారు. బీసీ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని గొల్లకురుమలకు విజ్ఞప్తి చేశారు. గొల్లకురుమలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.