E20 జనతా పార్టీ పేరుతో మరో ఉద్యమం: ఇంటర్నెట్లో ప్రకంపనలు.. టార్గెట్ నితిన్ గడ్కరీ రిజైన్ !

E20 జనతా పార్టీ పేరుతో మరో ఉద్యమం: ఇంటర్నెట్లో ప్రకంపనలు.. టార్గెట్ నితిన్ గడ్కరీ రిజైన్ !

దేశంలో మరో ఉద్యమం పుట్టింది. అది పెట్రోల్పై.. అవును.. E20 జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేశారు. E20 పెట్రోల్ వల్ల కార్లు, బైక్స్, వాహనాలు దెబ్బతింటున్నాయని.. మైలేజీ పడిపోతుందని ఇప్పటికే వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ సోషల్ మీడియా అకౌంట్ హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే E20పై దేశ వ్యాప్తంగా ఆందోళనకు వాహనదారులు రెడీ అవుతున్నారు.

E20 ఆయిల్ను బలవంతంగా వాహనదారులపై రుద్దుతున్నారని.. వాహనాలను నాశనం చేస్తున్నారని ఆన్ లైన్లో గగ్గోలు పెడుతున్నారు వాహనదారులు. E20 జనతా పార్టీ పేరుతో.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని టార్గెట్ చేస్తూ.. ఉద్యమం మొదలుపెట్టేశారు.. ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న E20 జనతా పార్టీ ఉద్యమం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

E20 జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ అయింది. 50 వేల మందికి పైగా ఫాలోవర్లు ఈ అకౌంట్ను ఫాలో అవుతున్నారు. ఇన్ స్టాగ్రాంలో కూడా E20 జనతా పార్టీ పేరుతో అకౌంట్ క్రియేట్ చేశారు. 2 లక్షలకు 29 వేల మందికి పైగా ఈ అకౌంట్ను ఫాలో అవుతున్నారు. ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూ పోతుండటం గమనార్హం.

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని ఉద్యమం మొదలైంది. వాహనాలు కొన్నప్పుడు భారీ మొత్తంలో GST కడుతున్నామని.. అందుకు ప్రతిఫలంగా తమ వాహనాలకు లైఫ్కు ముప్పు లేని ఇంధనం అందించడం ప్రభుత్వం బాధ్యత అని E20 జనతా పార్టీ పేర్కొంది.

E20 పెట్రోల్ వల్ల ఒక్క వాహనం అయినా దెబ్బతిన్నట్లు నిరూపిస్తే చూపించాలని నితిన్ గడ్కరీ ఇప్పటికే సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ E20 ఇంధనం వల్ల తమ కార్లు పాడయిపోయానని, మైలేజ్ ఘోరంగా తగ్గిందని కొందరు వాహనదారులు వీడియోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో.. నితిన్ గడ్కరీ సమర్థనను వాహనదారులు పూర్తిగా కొట్టిపారేశారు.

E20 ఇంధనాన్ని వాహనదారులపై బలవంతంగా రుద్దాలని చూస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తప్పనిసరిగా రాజీనామా చేయాలని E20 జనతా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుండటంతో మరో కేంద్ర మంత్రి రాజీనామాకు సిద్ధంగా ఉండాలని GenZలు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టారు.