లోక్‌‌సభ నియోజకవర్గాల పునర్విభజన 824కు పెరగనున్న సీట్లు.. తెలంగాణలో 26, ఏపీలో 38 కి చేరనున్న స్థానాలు

లోక్‌‌సభ నియోజకవర్గాల పునర్విభజన 824కు పెరగనున్న సీట్లు.. తెలంగాణలో 26, ఏపీలో 38 కి చేరనున్న స్థానాలు
  • ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదనలు
  • చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానాలు రెట్టింపు చేయాలని ఈఏసీ-పీఎం సిఫార్సు
  • 2027 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన చేపట్టాలని కమిటీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, వెలుగు:  దేశంలో లోక్‌‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) కీలక ప్రతిపాదనలు చేసింది. జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా పట్టణీకరణ, ఎస్సీ, ఎస్టీ జనాభా, భాషాపరమైన వైవిధ్యం వంటి బహుళ అంశాలను పరిగణనలోకి తీసుకుని 'లక్షిత విభజన' పద్ధతిలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రాతినిధ్యం పెంచే లక్ష్యంతో అక్కడి లోక్‌‌సభ స్థానాలను రెట్టింపు చేయాలని సిఫార్సు చేసింది.

ప్రస్తుతం దేశంలో 543 లోక్‌‌సభ స్థానాలు ఉండగా, తాజా ప్రతిపాదనలు అమలైతే నియోజకవర్గాల సంఖ్య 824కు చేరే ఛాన్స్ ఉన్నది. పెద్ద రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్లను సుమారు 50 శాతం వరకు పెంచేలా మోడల్‌‌ను రూపొందించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రస్తుతమున్న 170 నియోజకవర్గాలను పునర్విభజించాలని నివేదిక పేర్కొంది. వీటిలో 59 నియోజకవర్గాలను రెండు భాగాలుగా, 111 నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించే వీలున్నదని వెల్లడించింది.

2027 జనాభా లెక్కలతో విభజన

కొత్త ప్రతిపాదనల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో కూడా లోక్‌‌సభ నియోజకవర్గ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అయితే మొత్తం లోక్‌‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య శాతం ప్రస్తుతం ఉన్న 23.7 శాతం నుంచి స్వల్పంగా 23.6 శాతానికి మారే అవకాశం ఉన్నప్పటికీ, దాదాపు అదే స్థాయిలో కొనసాగేలా ప్రతిపాదనలు రూపొందించారు. కేరళలో ప్రస్తుతం ఉన్న 20 స్థానాలు 30కు, తమిళనాడులో 39 స్థానాలు 59కు పెరిగే అవకాశం ఉంది.

అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు కూడా అదనంగా లోక్‌‌సభ సీట్లు గణనీయంగా పెరగనున్నాయి.దేశంలోనే అత్యధిక లోక్‌‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌‌లో ప్రస్తుతం ఉన్న 80 స్థానాలు 120కు పెరుగుతాయని నివేదిక పేర్కొంది. చిన్న నియోజకవర్గాల ఏర్పాటు వల్ల ప్రజాప్రాతినిధ్యం మరింత మెరుగుపడటంతో పాటు దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం సుమారు 2.3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సలహా మండలి అంచనా వేసింది.

ఇక పట్టణ ప్రాంతాల్లో మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా మహిళా పోలింగ్ బూత్‌‌లు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. అలాగే రాబోయే 2027 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలు అమలైతే దేశ రాజకీయ చిత్రంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే వీలున్నది.