న్యూఢిల్లీ : తమ కుటుంబ పెద్దల సమ్మతితో ఆన్లైన్లో ఆధార్లోని చిరునామాలను ఎవరైనా అప్డేట్ చేసుకోవడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) అనుమతించింది. రేషన్ కార్డ్, మార్క్ షీట్, పెళ్లి ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ మొదలైన డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత, దరఖాస్తుదారుడు తమ కుటుంబ పెద్ద, ఇద్దరి పేర్లు, వారి మధ్య సంబంధాన్ని పేర్కొన్న తర్వాత అడ్రస్ మార్పు పనిని ప్రారంభించవచ్చు. ఇందుకు కుటుంబ పెద్ద ద్వారా ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్ అవసరం. రిలేషషన్షిప్ రుజువు అందుబాటులో లేకుంటే, యూఐడీఏఐ సూచించిన ఫార్మాట్లో కుటుంబ పెద్ద ద్వారా సెల్ఫ్-డిక్లరేషన్ను సమర్పించవచ్చు. తమ పేరు మీద సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేని పిల్లలు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు మొదలైనవారికి ఈ కొత్త విధానం ఎంతో అనువుగా ఉంటుంది.
వివిధ కారణాల వల్ల చాలా మంది నగరాలకు, పట్టణాలకు తరలి వెళ్తున్నందున ఇటువంటి సౌకర్యం లక్షల మందికి ప్రయోజనకరంగా ఉంటుందని యూఐడీఏఐ పేర్కొంది. గతంలో మాదిరే యూఐడీఏఐ నిర్దేశించిన అడ్రస్ ప్రూఫ్ ఉపయోగించి చిరునామాను మార్చే విధానం కూడా కొనసాగుతుంది. కొత్త పద్ధతిలో18 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా ఈ ప్రయోజనం కోసం కుటుంబ పెద్దగా మారవచ్చు. సంబంధీకులకు చిరునామాను అందజేయవచ్చు. దరఖాస్తులు ఆన్లైన్లో చిరునామాలను అప్డేట్ చేయడానికి 'మై ఆధార్' పోర్టల్ని సందర్శించాలి. కుటుంబ పెద్ద ఆధార్ నంబర్ను నమోదు చేయాలి. వెరిఫికేషన్ తర్వాత, నివాసి రిలేషన్ షిప్ రుజువును అప్లోడ్ చేయాలి. చిరునామాను మార్చుకోవడానికి చార్జీగా రూ. 50 చెల్లించాలి. డబ్బు డెబిట్ అయిన తరువాత సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (ఎస్ఆర్ఎన్) వస్తుంది. చిరునామా మార్పు రిక్వెస్ట్ గురించి కుటుంబ పెద్దకి ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది. ఇప్పుడు కుటుంబ పెద్ద అభ్యర్థనను ఆమోదించాలి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి 30 రోజులలోపు మై ఆధార్ పోర్టల్కి లాగిన్ అయి అంగీకారం తెలిపాలి. తదనంతరం రిక్వెస్ట్ను ఆమోదిస్తారు. కుటుంబ పెద్ద చిరునామాను పంచుకోవడానికి తిరస్కరిస్తే లేదా ఎస్ఆర్ఎన్ను అంగీకరించకపోయినా పని జరగదు.