మనీలాండరింగ్‌ కేసు.. తేజస్వీకి మళ్లీ ఈడీ సమన్లు

మనీలాండరింగ్‌ కేసు.. తేజస్వీకి మళ్లీ ఈడీ సమన్లు

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం (డిసెంబర్ 23న) మరోసారి సమన్లు జారీ చేసింది. రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కుంభకోణంలో విచారణకు రావాలని నోటీసులు అందించింది.  2024, జనవరి 5న హాజరు కావాలని సమన్లలో వివరించింది.

2024, జనవరి 6 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో పర్యటించేందుకు తేజస్వీ యాదవ్ కోర్టును ఆశ్రయించారు. విదేశాలకు వెళ్లాలని ఉందంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. 

ఇంతకు ముందు..  తేజస్వీ యాదవ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినా ఆయన హాజరుకాలేదు. 2004లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే బోర్డు ఐఆర్‌సీటీసీకి రైల్వే క్యాటరింగ్‌, రైల్వే హోటల్స్‌ సేవలను అప్పగించింది. రాంచీ, పూరీకి చెందిన హోటల్స్ నిర్వహణ, అభివృద్ధి కోసం జారీ చేసిన టెండర్‌లో అవకతవకలు జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 

టెండర్‌ దక్కించుకున్న హోటల్‌ యాజమాన్యం లాలూ కుటుంబానికి పాట్నాలో మూడెకరాల భూమిని ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో లాలూ, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌ సహా పలువురిని నిందితులుగా చేర్చారు.