ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరానికి అరెస్ట్ నుంచి ఊరట లభించేలా లేదు. ముందస్తు బెయిలు పిటిషన్ కోసం ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా..నిన్న(మంగళవారం )సాయంత్రమే దానిని తిరస్కరించింది. ఈ క్రమంలో చిదంబరం తరపున లాయర్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై చర్చ జరుగుతోంది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బెంచ్ నిరాకరించింది. మరోవైపు చిదంబరానికి బెయిల్ ఇవ్వరాదని ED కోర్టును కోరింది.
పిటిషన్ను సీజేఐకి ట్రాన్స్ఫర్ చేయాలని చిదంబరం తరఫున లాయర్లు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషన్ను పరిశీలించిన సీజే రంజన్ గొగోయ్ లంచ్ తర్వాత దీనిపై విచారణ జరుతామని స్పష్టం చేశారు. దీంతో సీజే తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చిదంబరంపై ED లుక్అవుట్ నోటీసులను జారీచేసింది. దేశం విడిచి పోకుండా ఉండాలని ED ఆదేశించింది. దీంతో చిదంబరం అరెస్ట్కు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన అజ్ఞాతంలోకి పోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.