షారూఖ్ ఖాన్ భార్యకు ఈడీ నోటీసులు

షారూఖ్ ఖాన్ భార్యకు ఈడీ నోటీసులు

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ భార్యకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు పంపింది. షారూఖ్ భార్య గౌరీఖాన్ రూ.30 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లక్నోకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ తులసియానీ గ్రూప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు గౌరీఖాన్‌. ఈ కేసులో మంగళవారం (డిసెంబర్ 19న) ఈడీ ఆమెకు నోటీసులు అందించింది. 

పెట్టుబడిదారులు, బ్యాంకులకు సుమారు రూ.30 కోట్ల ఆర్థిక నష్టం కలిగించిందని తులసియానీ గ్రూప్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గౌరీఖాన్ పై కేసు నమోదైంది. తాజాగా ఈడీ నోటీసులు పంపించింది. ఈ కేసుకు సంబంధించి గౌరీఖాన్ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపేందుకు ఈడీ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

తులసియానీ గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి గౌరీ ఎంత డబ్బు తీసుకున్నారనే కోణంలోనూ ఈడీ అధికారులు విచారించనున్నారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ హోదా కోసం చేసుకున్న ఒప్పందాలు, అందుకు సంబంధించిన వివరాలను కూడా రాబట్టనున్నారు.

ముంబైకి చెందిన కిరీట్ జస్వంత్ షా అనే వ్యక్తి 2015లో తులసియానీ రియల్ ఎస్టేట్ సంస్థ చేపట్టిన సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాజెక్టులోని ఫ్లాట్ ను రూ.85 లక్షలకు  కొనుగోలు చేశాడు. అయితే.. ఈ కంపెనీ షా నుంచి డబ్బులు తీసుకున్నాక ఫ్లాట్ ఇవ్వలేదు. డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. చివరకు పోలీసులకు ఆశ్రయించాడు బాధితుడు. తులసియానీ గ్రూప్ డైరెక్టర్లు అనిల్ కుమార్ తులసియానీ, మహేష్ తులసియానీ, బ్రాండ్ అంబాసిడర్ ఉన్న గౌరీఖాన్ పైనా  కిరీట్ జస్వంత్ షా ఫిర్యాదు చేశారు.2023, మార్చిలో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 

షారుఖ్ ఖాన్ భార్య, సినీ నిర్మాత, ఇంటీరియర్ డిజైనర్ గా మంచి గుర్తింపు ఉంది. అలాంటి గౌరీఖాన్ పై ఆరోపణలు రావడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈడీ నోటీసులపై గౌరీఖాన్ ఇంతవరకు స్పందించలేదు.