- ఎన్నికల పరిశీలకులు రవి నాయక్
సూర్యాపేట, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి నాయక్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరెట్ లోని వీసీ హాల్ లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్తో కలిసి పోలింగ్ సిబ్బంది కి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత ఎన్నికలు జరిగే ఆత్మకూరు ఎస్, సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం, నాగారం, నూతనకల్, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లోని ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, సిబ్బందికి పోలింగ్ విధులను కేటాయించారు.
జిల్లాలో మొదటి విడత లో 159 గ్రామ పంచాయతీల సర్పంచ్, 1442 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ సిబ్బంది కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు 1683, ఓపీవోలు 2260 పోలింగ్ కోసం ర్యాండమైజేషన్ జరిపారు. అడిషనల్కలెక్టర్ కే. సీతారామారావు, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీపీవో యాదగిరి, డీఎల్పీవో నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
