ఢిల్లీ : లిక్కర్ స్కాంకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీబీఐ కోర్టులో ఇవాళ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. తాజాగా సమర్పించనున్న ఛార్జ్ షీట్లో పలు కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మనీల్యాండరింగ్ కు సంబంధించి రెండు రోజుల్లో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఇటీవలే ఈడీ అధికారులు సీబీఐ స్పెషల్ కోర్టుకు తెలిపారు. ఈడీ ఇప్పటికే సమీర్ మహేంద్రు, ఆయనకు సంబంధించిన నాలుగు కంపెనీలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో ఎలాంటి అంశాలను ప్రస్తావించనుందన్నది ఆసక్తికరంగా మారింది.
లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్, బోయిన్పల్లి అభిషేక్ బెయిల్ పిటిషన్లను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టు బుధవారం విచారించింది. చార్జ్షీట్లో విజయ్ నాయర్పై సీబీఐ నిరాధార ఆరోపణలు చేసిందని ఆయన తరఫు లాయర్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో రూ.100 కోట్లు చేతులు మారాయని చెబుతోన్న ఈడీ, అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పడం లేదన్నారు. ఒక వేళ సౌత్ నుంచే వస్తే, ఏ రాష్ట్రం నుంచి వచ్చాయో చెప్పలేదన్నారు. రూ.100 కోట్లు ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు వంటి విషయాలనూ చార్జ్షీట్లో పేర్కొనలేదన్నారు. ఫోన్లు మార్చుకోవాలంటే ఈడీ, సీబీఐ అధికారుల పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు. ఫోన్లు మార్చుకోవద్దని ఎక్కడా రూల్ లేదన్నారు. వాట్సాప్, ఇతర యాప్స్లలో మెసేజ్లను తొలగించారనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈడీ వద్ద సరైన ఆధారాలు లేనందున బెయిల్ ఇవ్వాలని బెంచ్ను కోరారు.